గుడ్ న్యూస్, ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరిలో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నాయి, పరీక్షల్లో తేలింది

  • Published By: naveen ,Published On : August 19, 2020 / 04:18 PM IST
గుడ్ న్యూస్, ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరిలో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నాయి, పరీక్షల్లో తేలింది

మన దేశంలో ప్రతి నలుగురు వ్యక్తుల్లో ఒకరిలో కరోనా వైరస్ తో పోరాడేందుకు యాంటీబాడీలు ఉండే అవకాశం ఉందని కొవిడ్ 19 టెస్టులు నిర్వహించిన జాతీయ స్థాయి ప్రైవేట్ లేబరేటరీ తెలిపింది. అంటే ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడి కోలుకున్నట్టు అర్థమవుతుందని అధ్యయనకర్తలు చెప్పారు. వారికి తెలియకుండానే కరోనా సోకడం, తగ్గడం జరిగాయని అంటున్నారు. కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి ఉండొచ్చని తమ డేటా సూచిస్తోందని లేబరేటరీ ప్రతినిధులు వెల్లడించారు.



దేశంలోని పలు నగరాల్లో సర్వేలు నిర్వహించి, సెరో పాజిటివిటీ(యాంటీబాడీ టెస్టులు) శాతాలను నమోదు చేశారు. పుణెలో 50శాతం సెరో పాజిటివిటీ కనిపించింది. ముంబైలోని మురికివాడల్లో 57శాతం, ఢిల్లీలో 23శాతం సెరో పాజిటివిటీ కనిపించింది. ఏ వ్యక్తి శరీరంలో అయినా యాంటిబాడీస్ ఉన్నాయి అంటే, కరోనా వైరస్ ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి అతడిలో ఉందని అర్థం. ఆ రోగనిరోధక శక్తి సుదీర్ఘ కాలం ఉంటుందా, స్వల్ప కాలం ఉంటుందా అనేది అప్రస్తుతం. ఎక్కువమందిలో యాంటిబాడీలు ఉన్నట్టు అయితే కరోనా వైరస్ కు వ్యతిరేకంగా సామూహిక రోగనిరోధక శక్తి(herd immunity) ఏర్పడటానికి దారితీస్తుంది.

మంద రోగనిరోధక శక్తికి భారత్ ఇంకా చాలా దూరంలో ఉంది. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో మంద రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఉదాహరణకు ముంబైలోని ధారవి మురికి వాడ. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్లమ్. ఏప్రిల్ మే నెలల్లో ఇక్కడ కరోనా వైరస్ విలయతాండం చేసింది. కరోనాకు హాట్ స్పాట్ గా మారింది. అలాంటి ధారవిలో గత రెండు నెలలుగా ఒక్క కరోనా వ్యాప్తి కేసు కూడా నమోదు కాలేదు. సడెన్ గా అక్కడ కేసులు జీరో అయ్యాయి. దీనికి కారణం యాంటీబాడీలు అని నిపుణులు అంటున్నారు.



అధిక సెరో పాజిటివిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ లో ఉన్నాయి. దీనికి కారణం భారతీయుల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే అని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోరస్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి చెప్పారు.

మన దేశంలో ఇప్పటికే 18కోట్ల మంది తమ శరీరాల్లో యాంటిబాడీస్ కలిగి ఉండొచ్చని ఇటీవలే థైరో కేర్ అనే సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో టెస్టులు చేసిన జనాభాలో 29శాతం, మహారాష్ట్రలో 20శాతం జనాభాలో సెరో పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ముంబైలో 27శాతం, నవీ ముంబైలో 21శాతం, విలే పార్లీలో 42శాతం, వర్లీలో 41శాతం, డోంగ్రీలో 39శాతం సెరో పాజిటివిటీ ఉన్నట్టు గుర్తించారు. ప్రతి చోట 45 నుంచి 50శాతం వరకు పాజిటివిటీ ఉన్న కారణంగా వైరస్ ప్రభావం తగ్గిపోతుందన్నారు. మన దేశంలో ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు ముందుగా మంద రోగనిరోధక శక్తిని సంతరించుకుంటాయని బెంగళూరుకి చెందిన నిపుణుడు గిరిధర్ బాబు చెప్పారు.