కరోనా నుంచి కోలుకున్నా.. ఆర్గాన్స్ దెబ్బతీస్తుంది.. ఊపిరితిత్తుల్లో మచ్చలతో మొదలై కాలేయం వరకు తినేస్తుంది!
Covid-19 patients : ప్రపంచమంతా కరోనా వైరస్ పట్టిపీడుస్తోంది. కరోనా వైరస్ బారినపడినవారిలో ఎక్కువ శాతం కోలుకుంటున్నారు.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ దాని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటోంది. కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్లతో బాధపడుతూనే ఉన్నారు. కొంతమందిలో కరోనా సోకిన తర్వాత వారి శరీరమంతా దెబ్బతీస్తోంది. కేవలం ఊపిరితిత్తులు మాత్రమే కాదు.. ఇతర విటల్ ఆర్గాన్స్ సహా శరీర కణజాల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న 75 శాతం మంది బాధితుల్లో మూడు నెలలకు పైగా తాలుకూ తీవ్ర ప్రభావంతో బాధపడుతూనే ఉన్నారు.
కోలుకున్న రోగుల్లో చాలామందిలో శ్వాస తీసుకోలేకపోవడం, కండరాల నొప్పులు, తీవ్ర అలసట వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. కరోనా ప్రధాన లక్షణాల్లో ప్రధానంగా నిరంతర దగ్గు, జ్వరంతోపాటు వాసన, రుచి కోల్పోవడమే కాదు.. దీర్ఘ కాలికంగా బాధ పడేవారిలో వేర్వేరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
గతంలో కరోనా బారినపడి కోలుకున్న వారిలో సైకోసిస్, అలసట, చూపు కోల్పోవడం, మొబిలిటీ (చలనచీలత) వంటి అనారోగ్య సమస్యలను గుర్తించామని నిపుణులు వెల్లడించారు. కరోనా వైరస్ బాధితుల్లో దీర్ఘకాలికంగా ప్రభావం చూపే కొన్ని అనారోగ్య సమస్యలేంటో ఓసారి చూద్దాం..
1. ఊపిరితిత్తులపై మచ్చలు :
కరోనా వైరస్ అనేది శ్వాసకోశ వ్యాధి అనేది తెలిసిందే.. అందుకే ఎక్కువగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలామంది కరోనా బాధితుల్లో శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. దీన్నే acute respiratory distress syndrome (ARDS) అని అంటారు. ఇలాంటి బాధితులకు వెంటనే వెంటిలేటర్ ద్వారా ఆక్సీజన్ అందించాల్సి ఉంటుంది.
కరోనా నుంచి కోలుకున్నవారిలో వారి ఊపిరితిత్తులపై అధిక స్థాయిలో మచ్చలు ఏర్పడతాయి. తీవ్రమైన అనారోగ్యంతో పాటు ఊపిరితిత్తులపై మచ్చలతో మంటగా అనిపిస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తులు దెబ్బతిని బలహీనతకు దారితీస్తుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ లక్షణాలకు దారితీస్తుంది.. అంతేకాదు ఆక్సిజన్ దీర్ఘకాలిక అవసరం పడొచ్చు.
2. Liver damage (కాలేయాన్ని దెబ్బతీస్తుంది) :
కరోనా వైరస్ సోకిన చాలామందిలో కాలేయం దెబ్బతినే అవకాశం అధికంగా ఉంటుందని గతంలోనే చైనా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కరోనాతో ఆస్పత్రిలో చేరిన 34 మంది బాధితుల్లో రక్త పరీక్ష ఫలితాలను విశ్లేషించారు. కోలుకున్న బాధితుల్లో కాలేయ పనితీరుపై కరోనా తీవ్ర ప్రభావం ఉందని గుర్తించారు. రెండు టెస్టుల్లో కరోనా నెగటివ్ అని తేలాక డిశ్చార్జ్ అయిన కేసుల్లోనూ లివర్పై ప్రభావం పడినట్టు కనిపించింది.
3. Weakened heart (గుండెను బలహీనపర్చడం) :
కరోనా సోకిన వారి గుండెపై వైరస్ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులు.. గుండెకు కరోనా వ్యాధి అనేది ఒక పెద్ద ఒత్తిడిని కలిగించే పరీక్ష లాంటిదిగా అభిప్రాయపడ్డారు. అధికంగా మంట, అధిక జ్వరంతో కరోనా గుండెను బలహీనపరుస్తుంది. హృదయ సంబంధిత ముప్పు రావొచ్చు.. గుండెలో అసాధారణ మార్పులకు దారితీసి కొన్నిసార్లు రక్తం గడ్డకట్టే పరిస్థితి ఏర్పడచ్చు. గుండె విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువ. గుండె కండరాలు దెబ్బతిని చివరికి హార్ట్ ఎటాక్ సంభవించి మరణానికి దారితీయొచ్చు.
4. Impaired mobility (కండరాల్లో బలహీనత.. అచేతన స్థితి) :
కరోనా బాధితుల్లో చాలామంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వారిలో కొన్ని వారాల నుంచి నెలల వరకు శరీరకంగా కండరాల బలహీనతకు దారితీస్తుంది. కండరాలు చచ్చుబడినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. ఐసీయూలో చేరిన చాలామంది బాధితుల్లో ఇలాంటి పరిస్థితి కామన్ గా జరుగుతుంది. ఎందుకంటే.. బెడ్ రెస్ట్.. విశ్రాంతి ఎక్కువ కాలం తీసుకోవడంతో వారిలోని కండరాల్లో కదలిక తగ్గిపోతుంది.
ఫలితంగా కండరాలు పట్టేసినట్టుగా ఉండి అచేతన స్థితిలోకి వెళ్లిపోవడం జరుగుతుంది. ఆస్పత్రిలో బెడ్ రెస్ట్ తీసుకున్నవారిలో ప్రతిరోజు వారి కండరాల ధృడత్వం మూడు నుంచి 11 శతానికి పడిపోతుంది. ఇది నెలల నుంచి ఏళ్ల తరబడి ఉండొచ్చు. కరోనా బాధితులు సాధారణంగా రెండు వారాల్లో కోలుకుంటారు.. మరికొంతమందిలో దీర్ఘకాల సమయం పట్టొచ్చు.
5. Continued shortness of breath (నిరంతరం శ్వాసకోశ సమస్య) :
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలామందిలో బాధితుల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. SARS వ్యాధి ఇన్ఫెక్షన్ సోకినవారిలోనూ శ్వాసకోశ సమస్య నెలవరకు ఉండే అవకాశం ఉంది. కరోనా బాధితుల్లోనూ ఇదేరకమైన సమస్య ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరికొంతమందిలో acute respiratory distress syndrome (ARDS) కారణంగా ఊపిరి కష్టంగా ఉండటం నెలలు లేదా జీవితకాలం ఉండే ముప్పు ఉంది.
6. Mental health problems (మానసిక ఆరోగ్య సమస్యలు) :
కరోనా వైరస్ బాధితుల్లో చాలామందిలో మానసిక ఆరోగ్య రుగ్మతలకు కారణమవుతోందని మానసిక నిపుణులు అంటున్నారు. ఒత్తిడి, ఆందోళన వంటి అనేక రకాల మానసిక వ్యాధులకు కరోనా కారణమవుతోందని చెబుతున్నారు. SARS నుంచి కోలుకున్న బాధితుల్లోనూ మూడింట ఒక వంతు కంటే ఎక్కువమందిలో ఒత్తిడితో పాటు 12 నెలల వరకు ఆందోళన వంటి మానసిక సమస్యలు ఉన్నాయని అధ్యయనం పేర్కొంది.