Home » కాస్ట్లీ గురూ : కోనసీమ పుంజులకు భారీ రేటు
Published
2 years agoon
By
veegamteamసంక్రాంతి అంటే భోగి మంటలు, రంగవల్లులు, కొత్త అల్లుళ్లు, పిండివంటలు, కొత్త దుస్తులు.. ఇవే కాదు.. సంక్రాంతి సంబంరం అంటే నేనే అంటోంది కోడి పుంజు. కొక్కొరొకో అని కూయడమే కాదు తొడగొట్టి కోట్లు కురపిస్తానంటూ పందెం బరిలోకి దిగింది. బెట్టింగా బంగార్రాజులు రెడీ అయిపోయారు. కోడి పందాలకు తహతహలాడుతున్నారు. మూడు రోజుల పాటు కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. బెట్టింగుల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.
రంగు రంగుల రిబ్బన్ అంచులతో సిద్ధం చేస్తున్న చలువ పందిళ్లు. ఏ పెళ్లి కోసమో.. లేక ఫంక్షన్ కోసమో ఇవి రెడీ చేస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్టే. పందెం కోళ్ల సయ్యాటకు వెలిసిన బరులివి. ఉభయ గోదావరి జిల్లాల్లో… ఇటు కృష్ణా నుంచి పల్నాడ వరకు .. ఎక్కడికక్కడ కోళ్ల పందాల కోసం బరులు రెడీ అయ్యాయి. బెట్టింగ్ రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటుంటే.. అతిథులకు అలసట కలగకుండా నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు.
* పోటీకి కాలుదువ్వుతున్న కోళ్లు
* నోట్ల కట్టలతో సిద్ధమైన పందెంరాయుళ్లు
* అతిథుల రాకతో గోదావరి జిల్లాల్లో సందడి
పందేల బరిలో దిగడానికి కోడి పుంజులు కాళ్లు దువ్వుతున్నాయి. అంతే స్థాయిలో పందెం కాయడానికి పందెరాయుళ్లు నోట్ల కట్టలతో సిద్ధమయ్యారు. సంక్రాంతి మూడు రోజులూ వీటిని భారీగా నిర్వహించానికి ఏపీలో పలుచోట్ల బరులు సిద్ధం చేశారు. 2019, జనవరి 14వ తేదీ సోమవారం నుంచే కోడి పందేల జాతరకు తెరలేచింది. ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలోనూ ఈ సందడి తార స్థాయికి చేరింది.
కోనసీమ పుంజు @ లక్షా 50వేలు:
కోడి పందేల్లో కోనసీమ పుంజులకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఇక్కడి వాతావరణంలో పెరిగిన పుంజులు పందేలలో రాణిస్తాయన్న నమ్మకం ఉంది. పెంపకం, తర్ఫీదు కూడా అదేస్థాయిలో ఉంటుంది. ప్రస్తుత సంక్రాంతికి పందెం రాయుళ్లు కోనసీమ పుంజులపై అత్యధికంగా నగదు పెట్టారని సమాచారం. ఈసారి కోనసీమ పుంజు ఏకంగా లక్షా 50వేల రూపాయల ధర పలికింది. ఈ ధరకు సుమారు 300లకుపైగా పందెం పుంజులు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లాయి. లక్షా 50 వేలలోపు ధరలున్న పుంజులు కూడా అధికంగా అమ్ముడయ్యాయి.
గ్రేడింగ్ ఇలా:
పెంపకం స్థావరాల్లో కోడి పుంజులకు గ్రేడింగ్ పూర్తిచేసి పందెం బరులకు తరలించారు. తొలుత డింకీ పందెం వేస్తారు. అందులో పందెం పుంజు తన ప్రత్యర్థి పుంజుపై నిమిషానికి నాలుగుసార్లు చొప్పున దాడిచేసి వరుసగా రెండు డింకీ పందేలలో ప్రతిభ చూపితే ఆ పుంజు మొదటి శ్రేణి పుంజుగా పరిగణిస్తారు. ఈ రకం పుంజు ధర లక్షా 50వేల రూపాయలు ఉంటుంది
ఫారిన్ నుంచి వచ్చేశారు:
సంక్రాంతి పండుగ కోసం అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో స్థిరపడిన వారు సైతం సొంతూళ్లకు వచ్చారు. కోడి పందేల్లో పాల్గొనేందుకు స్థానిక బ్యాంకుల్లోని తమ ఖాతాల్లోకి నగదును బదిలీ చేసేశారు. పురుషులకు తామేమీ తీసిపోమంటూ మహిళలు, యువతులు కూడా పందేలకు వస్తున్నారు. కోనసీమలోని దిండి పరిసర రిసార్ట్స్లతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని హోటళ్లు నెలరోజుల కిందటే బుక్ అయిపోయాయి. అమరావతి, విజయవాడ, రాయలసీమ ఉత్తరాంధ్రలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నాగపూర్, భువనేశ్వర్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచీ కూడా పందెం రాయుళ్లు చేరుకుంటున్నారు. ‘పశ్చిమ’లో అయితే పర్యాటక ఏజెంట్లు ప్రైవేటు నివాస గృహాలను కూడా సంప్రదిస్తున్నారు. ఒక మడత మంచం వేస్తే సాధారణ తాటాకు ఇల్లు కూడా స్టార్ హోటల్ రూమ్ ధర పలుకుతోంది.