నగరవాసులకు గుడ్న్యూస్: 24 గంటలు వాటర్
హైదరాబాద్ నగర వాసులకు త్వరలో 24 గంటలు నీటి సరఫరా అందనుంది. దీని కోసం ఇప్పటికే వాటర్ బోర్డ్ అధికారులు కసరత్తులు చేపట్టారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రజలకు నిరంతరం నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటోంది.
రిజర్వాయర్లలో నీరు సమృద్దిగా ఉండటంతో ప్రజలకు నీటి కష్టాలు ఉండకూడదనే ఉద్ధేశ్యంతో మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగానే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉస్మాన్సాగర్ 18 ఎంజీడీలు, హిమాయత్సాగర్ 10, కృష్ణా మూడు దశల ద్వారా 273, గోదావరి పథకంతో 167లు కలిపి నిత్యం 468 మిలియన్ గ్యాలన్ల రోజుకు నీటిని ప్రజలకు అందిస్తున్నారు.
నగరంలోని ప్రాంతాల వారీగా రెండు రోజులకొకసారి నీటి సరఫరా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాగు, మురుగునీటి వ్యవస్థ పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో 24×7 నిరంతరం నీటి సరఫరాను అమలు చేయాలని మంత్రి కేటీఆర్ వాటర్ బోర్డ్ అధికారులకు ఆదేశించారు.
దీంతో వారానికి 24 గంటలపాటు నీటి సరఫరాకు సాధ్యాసాధ్యాలపై అధికారులు అద్యయనం చేస్తున్నారు. భవిష్యత్తులో జనాభా డిమండ్ కు తగిన నీటి సమస్యలు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది వాటర్ బోర్డ్. దీనికి సంబంధించి త్వరలోనే సమగ్ర నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ పనుల్లో అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. దీంట్లో భాగంగా 24 గంటలు నీటి సరఫరా చేసే ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.