బీభత్సంగా తాగారు : 4 నెలల్లో రూ.6వేల కోట్ల లిక్కర్ సేల్స్
హైదరాబాద్ : మందుబాబులు సర్కార్ ఖజానా నింపేస్తున్నారు. సందర్భం ఏదైనా మద్యం పొంగి పొర్లాల్సిందే. తాగాల్సిందే..తూగాల్సిందే..దీన్ని ఆసరా చేసుకుని అబ్కారీ శాఖ గల్లా పెట్టెలు ఫుల్ అయిపోయాయి. రాష్ట్రంలో అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, సంక్రాంతి పండుగ ఇవన్నీ ఎక్సైజ్ శాఖ ఖజానాన్ని నింపేశాయి. నాలుగే నాలుగు నెలల్లో మద్యం ఆదాయం ఎంతంటే.. రూ.6వేల కోట్లు.
పెరుగుతున్న అమ్మకాలతో ప్రతి సంవత్సరం అంచనాలకు మించి ఎక్సైజ్ శాఖకు అధిక ఆదాయం వస్తుంది. మద్యం విక్రయాలపై బడ్జెట్లో ప్రకటించినదానికన్నా.. రెట్టింపుగా అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఖజానాకు సగానికి పైగా ఆదాయం మద్యం అమ్మకాల ద్వారానే వస్తుండటం విశేషం.
- నాలుగు నెలల్లో రూ. 6 వేల కోట్లు
- అసెంబ్లీ ఎన్నికల్లో రూ.3వేల 500 కోట్ల ఆదాయం
- పంచాయితీ ఎన్నికలు రూ. రూ.1680 కోట్లు
- న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రూ.500 కోట్లు
- సంక్రాంతి వేడుకలకు రూ. రూ. 150 కోట్లు
రూ. 23వేల కోట్లకు చేరే అవకాశం : 2019 ఆర్థిక సంవత్సరానికి లిక్కర్ సేల్స్ రూ. 23వేల కోట్లకు చేరుతుందని అంచనా. గత 6 నెలల్లోనే రూ.18వేల కోట్ల ఆదాయం వచ్చేసింది. రాబోయే రెండు నెలల్లో మరో రూ.5వేల కోట్లు రావొచ్చని అంచనా. బ్రాండెడ్ కన్నా చీప్ లిక్కర్, బీర్ల అమ్మకాలతోనే రూ.5వేల 200 కోట్ల ఆదాయం వచ్చింది. పంచాయతీలు, మున్సిపాల్టీ పరిధిలో చీప్ లిక్కర్, అగ్వ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.