ఇంటి దగ్గరకే ఆధార్ సేవలు

  • Published By: venkaiahnaidu ,Published On : November 1, 2019 / 02:31 AM IST
ఇంటి దగ్గరకే ఆధార్ సేవలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలూ తమ సేవలను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో ప్రతి ఒక్కరికి ఆధార్‌ తప్పనిసరిగా మారిన సేపథ్యంలో ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ఆధార్‌ సేవలు అందించాలని తపాలా శాఖ నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని జనరల్, హెడ్, సబ్‌ పోస్టాఫీసుల్లో ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన తపాలా శాఖ ఇప్పుడు… ఆధార్‌ నమోదు, చేర్పులు, మార్పుల సేవలు అవసరమున్నట్లు సమాచారం అందిస్తే చాలు.. డోర్‌ దగ్గరకు వచ్చి సేవలందించనుంది. గత రెండున్నరేళ్ల క్రితమే జాతీయ స్థాయిలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తో ఒప్పందం కుదుర్చుకున్న పోస్టల్‌ శాఖ ఆధార్‌ అధీకృత కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది.

ఇప్పటికే కొత్తగా పుట్టిన శిశువులు, చిన్నారులు మినహా దాదాపు ప్రతి ఒక్కరూ ఆధార్‌ నమోదు చేసుకున్నప్పటికీ పేరు, ఇంటి పేర్లలో అక్షర దోషాలు, సవరణలు, చిరునామాలు, మొబైల్‌ నెంబర్ల లింకేజీ, మార్పు కోసం ఆధార్‌ కేంద్రాలకు పరుగులు తీయక తప్పడం లేదు. దీంతో ఆధార్‌ కేంద్రాలకు డిమాండ్‌ పెరిగింది.
.
హైదరాబాద్‌లో పోస్టల్‌ శాఖ ఆధార్‌ కేంద్రాల ద్వారా రెండున్నరేళ్లుగా పెద్ద ఎత్తున సేవలందిస్తోంది. పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రాలకు మంచి స్పందన వస్తోంది. దీంతో ఇక ప్రజలకు ఇళ్ల దగ్గరకే ఆధార్‌ సేవలు అందించాలని నిర్ణయించారు. ఆధార్‌ సేవలు అవసరమున్నవారు కనీసం 30 మంది ఉంటే చాలు వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఆధార్‌ సేవలందిస్తారు. కేవలం విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తే చాలు. అపార్ట్‌మెంట్, వీధి, కాలనీ కమిటీ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఓ అధికారి తెలిపారు. నేరుగా సెల్‌ నెంబర్‌ 9440644035ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.