హైదరాబాద్లో మరో అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం
హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్ : నగరంలో మరో అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఫిలిప్పైన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇరి) దక్షిణ భారత ప్రాంతీయ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది. ప్రతిష్టాత్మకమైన ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది.
రాజేంద్రనగర్లో కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మార్చి 23 శనివారం కీలక ఒప్పందం కుదిరింది. ఇరి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మాథ్యూమోరల్, వ్యవసాయ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రవీణ్రావు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.
తెలంగాణలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. ఇరు సంస్థల అధ్యాపకులు, విద్యార్థుల పరస్పర బదిలీ జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టినందున, వరి సేద్యం పెరిగే అవకాశం ఉంది. రైతులకు నాణ్యమైన, చీడపీడలను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయవచ్చు. డయాబెటిక్ బాధితులు పెరుగుతున్నందున ‘లో గ్లైసిమిక్ ఇండెక్స్’ కలిగిన వరి విత్తనాల రూపకల్పనపై కూడా పరిశోధనలు చేయాలని నిర్ణయించారు. అంతకుముందు అధికారుల బృందం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. సాధారణ ఎన్నికలు ముగిసిన తరువాత ఒప్పందంపై చర్చిద్దామని ఈ సందర్భంగా మంత్రి అధికారుల బృందానికి తెలిపారు.