చల్లని వార్త : నేడు ఒక మాదిరి వర్షాలు
కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న వారికి చల్లని వార్త అందించింది వాతావరణ శాఖ. మే 11వ తేదీ శనివారం, మే 12వ తేదీ ఆదివారం రాష్ట్రంలోని అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఒడిశా నుండి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా శ్రీలంక వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని..వీటి వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించింది.
వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం అధిక ఎండలు ఉండనున్నాయి. ఎండలతో కూడిన వడగాలులు వీస్తాయి. కోస్తాంద్ర దక్షిణ ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.