మీ ఓటు ఉందో.. లేదో ఇలా చెక్ చేసుకోండి
అమరావతి : దేశ వ్యప్తంగా పార్లమెంట్ ఎన్నికల యుద్ధం వచ్చేసింది. అలాగే కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఓట్ల గల్లంతు వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య కాకరేపుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో నని ఓటర్లు ఆందోళన పడుతుంటారు. తమ ఓటును చెక్ చేసుకోవాలని..ఒకవేళ లేకుంటే 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.
దీనికి సంబంధించి ఓటర్ హెల్ప్ లైన్ గా 1950 నంబర్ ను ఏర్పాటు చేశామని..ఈ నంబర్ కు కాల్ చేసి వారి వివరాలు చెప్పి ఓటు ఉందో? లేదో? తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ హెల్ప్ లైన్, నా ఓట్, వాదా యాప్ ల నుంచి కూడా జాబితాలో పేరును చూసుకోవచ్చని, ‘http://ceotelangana.nic.in’, ‘http://ceoandhrapradesh.nic.in’ వెబ్ సైట్ లోనూ, ఆప్షన్ ను ఎంచుకుని ఓటును చెక్ చేసుకోవచ్చని తెలిపారు. దీంతో పాటు ఓటర్ల జాబితాలను బూత్ లెవల్ ఏజంట్ వద్ద అందుబాటులో ఉంచామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.