పంచాయతీ సమరం : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటీషన్

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 09:13 AM IST
పంచాయతీ సమరం : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటీషన్

హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. సరిగ్గా ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 3వ తేదీ విడుదల కానున్న ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలని హౌస్ మోషన్ పిటిషన్ వేశారు.

ఆర్.కృష్ణయ్య పిటీషన్ వేయటానికి కారణం లేకపోలేదు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ రద్దు చేయాలని కోర్టుని కోరారు. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ అని.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ రేషియో ఇవ్వాలని కోరారు. 34శాతం కాదు.. 50శాతం ఇవ్వాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని.. అలాంటిది.. ఉన్న 34శాతం నుంచి 22శాతానికి తగ్గించటాన్ని పిటీషన్ లో తప్పుబట్టారు కృష్ణయ్య.