బ్యాంకు ను రూ.5 కోట్లకు బురిడీ కొట్టించిన దంపతులు అరెస్ట్

  • Published By: murthy ,Published On : November 19, 2020 / 05:54 PM IST
బ్యాంకు ను రూ.5 కోట్లకు బురిడీ కొట్టించిన దంపతులు అరెస్ట్

Hyderabad couple swindles bank of 5.3 Crore, Arrested  :తప్పుడు పత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టించటం.. రియల్టర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకుని డబ్బులు ఎగ్గోడుతూ మోసాలకు పాల్పడుతూ…. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు బ్యాంక్ ను మోసం చేయటమే కాక రియల్ ఎస్టేట్ లో దాదాపు రూ.25 కోట్ల రూపాయల మేరమోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటిపై విచారణ చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల గ్రామానికి చెందిన పబంతి ప్రభాకర్, సరిత దంపతులు హైదరాబాద్‌లోని టోలిచౌకిలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ప్రొప్రెయిటర్లుగా సాయి ప్రాపర్టీ డెవలపర్స్‌ సంస్థను ఏర్పాటుచేసి షాద్‌నగర్, నాగోల్, బండ్లగూడ, రాజేంద్రనగర్, నార్సింగ్, ఫతుల్లాగూడ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు.



భూములను కొని వాటిని వెంచర్లుగా చేసి అమ్మేవారు. అయితే వీరు వేసిన వెంచర్లు గ్రామాలకు చివరన ఉండటంతోనో, మరో కారణంతోనో అమ్ముడుపోక…. . వ్యాపారంలో నష్టాలు రావటం మొదలై అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అప్పుల్లోంచి బయటపడే మార్గం లేక ఇక మోసాలకు తెరతీశారు.

ప్రభాకర్‌ దంపతులు కొన్నేళ్ల క్రితం షాద్‌నగర్‌ పరిధి సోలీపూర్‌ గ్రామ శివారులో 25 ఎకరాల భూమిని కొని వెంచర్‌ వేసారు. ఆ ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన రుణం కోసం 2015లో షాద్‌నగర్‌లోని ఇండియన్‌ బ్యాంక్‌ లో లోన్ కు అప్లై చేశారు. ఇళ్లు అమ్మినట్లు బ్యాంకు వారిని తప్పుదోవ పట్టించేందుకు బోగస్‌ వ్యక్తుల్ని, వారి ఆధార్‌ కార్డులను, జీతాల ధ్రువీకరణ పత్రాల నకళ్లు సృష్టించారు.



వాటి ఆధారంగా విడతల  వారీగా బ్యాంకు నుంచి రూ.5 కోట్లకు పైగా రుణం పొందారు. ఫతుల్లాగూడలో మరో వెంచర్ వేస్తూ….దివాకర్‌సింగ్‌ అనే వ్యక్తికి చెందిన 9 ఎకరాల భూమిని కొనేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వీరు అతనికి డబ్బులు సరిగా చెల్లించలేదు. అందులో వెంచర్ వేసి ప్లాట్లు అమ్మి డబ్బులు వసూలు చేసుకున్నారు.

మరోక చోట అపార్ట్‌మెంట్‌ నిర్మాణదారుడు కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా మోసం చేశారు. ఇలాగే మరికొన్ని మోసాలకు పాల్పడిన వీరిపై అబ్దుల్లాపూర్‌మెట్, కేపీహెచ్‌బీ, రాజేంద్రనగర్, మాదాపూర్, నార్సింగ్‌ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ విధంగా దంపతులు దాదాపు రూ.25 కోట్ల మోసాలకు పాల్పడినట్లు తెలిసింది.  మరోపక్క ప్రభాకర్‌ దంపతులు తీసుకున్న రుణాన్ని ఎంతకీ తిరిగి చెల్లించక పోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు.. రుణపత్రాలను పరిశీలించారు.



రుణం కోసం సమర్పించిన పత్రాలు అన్నీ తప్పుడు పత్రాలుగా గుర్తించి గత అక్టోబర్‌లో బ్యాంకు మేనేజర్‌ మహేందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రభాకర్‌ దంపతులను అరెస్టు చేసేందుకు నవంబర్ 17 రాత్రి టోలీచౌకిలోని వారి విల్లాకు వెళ్లారు. అక్కడ ప్రభాకర్‌ బంధువులు, సన్నిహితులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. షాద్‌నగర్‌ పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్, సిబ్బంది చాకచక్యంగా ప్రభాకర్ దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అడ్డుకున్న వారిపై కూడా గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, ప్రభాకర్‌ దంపతులు చేసిన అప్పులను తీర్చేందుకు మరికొన్ని అప్పులు చేస్తూ చిట్టీల వ్యాపారం చేసే వారని, ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఏసీపీ సురేందర్‌ తెలిపారు. విలాసవంతమైన విల్లా, కార్లు, బైకులు కొన్నారని, ప్రభాకర్‌ చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడని చెప్పారు.