గణేష్ మండపాలు : ప్రాణాల మీదికి తెస్తున్న లడ్డూ పోటీలు

గణేష్ మండపాలు దగ్గర లడ్డూలు తినే పోటీలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. లడ్డూలు గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

  • Published By: veegamteam ,Published On : September 6, 2019 / 04:47 AM IST
గణేష్ మండపాలు : ప్రాణాల మీదికి తెస్తున్న లడ్డూ పోటీలు

గణేష్ మండపాలు దగ్గర లడ్డూలు తినే పోటీలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. లడ్డూలు గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

వినాయకుడికి నైవేధ్యంగా పెట్టిన లడ్డూల వేలం పాటతో పాటు ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారనే పోటీలు కూడా అక్కడక్కడా జరుగుతుంటాయి. చివరి నాలుగైదు రోజులు ఈ పోటీలు జోరుగా జరుగుతాయి. లడ్డూ వేలం పాటల వరకు పర్వాలేదు కానీ, వాటిని తినే పోటీలు మాత్రం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వినాయక చవతి ఉత్సవాలను పురస్కరించుకొని సరదా కోసం ఓ ఎఫ్ ఎం రేడియో సంస్థ తార్నాకలో ఏర్పాటు చేసిన లడ్డూలు తినే పోటీ జోషీ అనే వ్యక్తి ప్రాణాలు తీసిందని గుర్తుచేస్తున్నారు.

గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా కొందరు మండపాల నిర్వాహకులతో పాటు వివిధ ప్రైవేట్ సంస్థలూ ప్రచారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వివిధ ఆకృతులతో ఉన్న టోపీలు, టీ షర్టులు పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా లడ్డూలు తినే పోటీలు వంటివీ నిర్వహిస్తారు. పోటీలో పాల్గొని అందరికంటే ఎక్కవ లడ్డూలు తిన్న వారిని విజేతగా ప్రకటించి, బంగారు నాణాలు, నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తుంటారు. ఇలాంటి పోటీలు ప్రాణాలు తీస్తాయని, ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని స్పష్టం చేశారు. 

ఇలాంటి పోటీల్లో పాల్గొనే వారు విజేతలుగా నిలవాలనే ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎక్కువ లడ్డూలు తినే ప్రయత్నం చేస్తారు. దీనికోసం లడ్డూను పూర్తిగా నమలకుండా మింగేయడంతోపాటు ఏ మాత్రం విరామం లేకుండా ఒకదాని తర్వాత మరొకటి తినాలని చూస్తుంటారు. అలాంటి సందర్భాల్లో లడ్డూలు గొంతులో ఇరుక్కుంటాయని, కొన్ని సందర్భాల్లో బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తరలించినా నోట్లో ఇరుకున్న లడ్డూలను తొలగించేందుకు డాక్టర్లు ప్రయత్నించినా ఫలితాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమయంలో కనీసం మంచినీళ్లు సైతం తాగలేని పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. చివరకు గొంతులో ఇరుక్కున్న లడ్డు కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారి, బాధితుడు చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

ఇలాంటి పోటీ క్రమంలో లడ్డూను కంగారుగా తినడంతో అది శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరాడక బాధితులు మరణిస్తూ ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు. కంఠంలో ముందు భాగంలో ఉండే శ్వాసనాళం (ట్రేకియా) ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. దీని ద్వారా మనిషి శ్వాస తీసుకుంటారు. దానికి వెనుక వైపు వెన్నుపూసల మధ్య అన్నవాహిక ఉంటుంది. ఆహారం తీసుకునేటప్పుడు గొంతులో కొండనాలిక పని తీరు వల్ల ఆ పదార్థం శ్వాసనాళంలోకి కాకుండా అన్నవాహికలోకి వెళ్తుంది. ఈ కొండనాలిక సరిగ్గా పని చేయనప్పుడే పొలమూరుతూ మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతాడు.

లడ్డూ పోటీలతో ఒకేసారి ఎక్కువ మొత్తంలో, కంగారుగా లడ్డూలు తినడంతో కొండనాలిక సరిగ్గా పని చేయకపోవచ్చు. దీంతో ఆ ఆహార పదార్ధాలు ట్రేకియాలోకి వెళ్లి ఇరుక్కుపోతుంటాయి. ఫలితంగా బాధితుడికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి చనిపోతాడు. ఒక్కోసారి స్వరపేటిక పైన ఉండే వేగస్ నెర్వ్ పై ఒత్తిడి పెరగడంతో వేగ ఇగ్విబిషన్ అనేది ఏర్పడుతుందని, ఫలితంగా గుండె ఆగిపోతుందని వివరిస్తున్నారు. 

నగరంలో గణేష్ మండపాల నిర్వాహకులు వినాయకుడి విగ్రహానికి ప్రసాదంగా పెట్టే లడ్డూపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి లడ్డూలకు ఓ విశిష్టత ఉంటుంది. విభిన్న తరహాలో ఏర్పాటు చేయడం, వేలంలో భారీ రేటు పలకడం, ఉచితంగా పంపిణీ చేయడం వంటి చర్యలతో నిర్వాహకులు భక్తుల్ని ఆకర్షిస్తుంటారు. అయితే ఇలాంటి లడ్డూలు తస్కరిస్తే శుభం అనే సెంటిమెంట్ సైతం కొందరికి ఉంటుందన్నారు. గతంలో ఇలాంటి నేరం చేసే ఐదుగురు యువకులు కటకటాల్లోకి చేరినట్లు తెలిపారు.

అయితే సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని లడ్డూలు తస్కరణకు గురైతే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈక్రమంలో మండపాల నిర్వాహకులు పక్కాగా సీసీ కెమెరాలు కలిగి ఉండి, రాత్రి వేళల్లో తమ ప్రసాదాలపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు. అక్కడ కచ్చితంగా ఒక్క వాలంటీరు అయినా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also Read : గణేష్ నిమజ్జనం : రూ. కోట్లల్లో ఖర్చు