గాంధీ డాక్టర్ కధ సుఖాంతం : వసంత్ ను అదుపులోకి తీసుకున్నపోలీసులు

  • Published By: chvmurthy ,Published On : February 11, 2020 / 08:00 AM IST
గాంధీ డాక్టర్ కధ సుఖాంతం : వసంత్ ను అదుపులోకి తీసుకున్నపోలీసులు

సికింద్రాబాద్  గాంధీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న  సూసైడ్ హై డ్రామా సుఖాంతం అయ్యింది.  గాంధీ ఆస్పత్రిలో  కరోనా వైరస్ గురించి  దుష్ప్రచారం చేశారనే ఆరోపణలతో సీఎంఓ గా పనిచేస్తున్న  డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. శనివారం ఆయన్ను సస్పెండ్ చేస్తూ  వైద్య ఆరోగ్య శాఖకు  నిర్ణయం తీసుకుంది.  సోమవారం ఉదయం తన పర్సనల్ మెయిల్ చెక్ చేసుకున్న డాక్టర్ వసంత్ ఉన్నతాధికారులను సంప్రదించగా వారినుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. 

మంగళవారం, పిబ్రవరి 11 ఉదయం ఆయన వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కలిసినప్పటికీ ఆయన నుంచి కూడా  తన సస్పెన్ష్ పై  స్పష్టమైన హామీ  రాకపోవటంతో సూసైడ్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఒంటికి రెండు పెట్రోల్ బాటిల్స్ కట్టుకుని…లైటర్ చేతపుచ్చుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో గాంధీ ఆస్పత్రికి వచ్చారు.  దాదాపు  గంటసేపు ఆయన అస్పత్రిలో జరుగుతున్న అవినీతిని ఏకరువు పెట్టారు. పోలీసులు, ఆస్పత్రివైద్యుల సంఘం నాయకులు, సహచర వైద్యులు ఎంత నచ్చచెప్పినా ఆయన అందరినీ బెదిరిస్తూ  గంటకుపైగా వీరంగం సృష్టించారు.

ఆస్పత్రిలో శానిటేషన్ లోనూ, సెక్యూరిటీ లోనూ ఇలా ప్రతి విషయంలోనూ అవినీతి పెరిగి పోయిందని….. ఈ.ఎస్.ఐ. కంటే పెద్ద స్కాం గాంధీలో జరుగుతోందని ఆరోపణలు చేశారు. గాంధీ ఆస్పత్రి లో జరుగుతున్నఅనేక అక్రమాలను బయట పెడుతున్నందుకే తనపై వేటు వేశారని వసంత్ ఆరోపించారు.

తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ నాయకుడిగా ఉన్న తనకే న్యాయం జరగటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ చేసుకోటానికి యత్నించారు. చేయని తప్పులకు తనపై సూపరింటెండెంట్  ఆరోపణలు చేస్తూ తనను  సస్పెండ్ చేశారని ఆరోపించారు. డాక్టర్ వసంత్ భార్య   జ్యోతిర్మయి  గైనకాలజి డిపార్ట్ మెంట్లో అసిస్టెంట్ ప్రోఫెసర్ గా పని చేస్తున్నారు.

అస్పత్రిలో జరిగిన అవినీతిని విలేకరులతో చెపుతుండగా పోలీసులు చాకచక్యంగా అతనిపై పడి చేతిలోని లైటర్ లాగేసి…ఒంటికి కట్టుకున్న పెట్రోల్ బాటిల్స్ తీసివేసారు. ఒంటిపై ఒక్కసారిగా నీళ్లు పోసి ప్రమాదం తప్పించారు. గంటకు పైగా సాగిన ఉత్కంఠకు తెర దింపారు. అనంతరం డాక్టర్ వసంత్ నుచిలకులగూడా పోలీసు స్టేషన్ కు తరలించారు.