రోడ్లపై గుంతలుంటే జీతాలు కట్..అధికారులకు షాక్ ఇచ్చిన GHMC కమిషనర్

రోడ్లపై గుంతలుంటే జీతాలు కట్..అధికారులకు షాక్ ఇచ్చిన GHMC కమిషనర్

GHMC commissioner focused on roads management : చినుకు పడితే రోడ్లన్నీ గుంతల మయమే. బండిమీద వెళితే నడుములు విరిగిపోవటం ఖాయం. రోడ్లపై ఉండే గుంతలపై ఎన్ని విమర్శలువస్తున్నా… అధికారుల్లో స్పందన లేదు. సీరియస్‌గా తీసుకోవడం లేదు. రోడ్లపై గుంతలు పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రాణాలు కూడా పోయిన ఘటనలు జరిగాయి. అయినా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. నగరవాసుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ నగర రోడ్లపై కమిషనర్ ఫోకస్ పెట్టారు. గుంతల్ని మూడురోజుల్లో పూడ్చకపోతే సిబ్బంది జీతాలు కట్ అంటూ షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించి కమిషనర్ లోకేశ్ కుమార్
సర్య్కులర్ జారీ చేశారు.

సీఆర్‌ఎంపీ(సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం) పథకం కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించిన రహదారుల తీరుపై నిరంతర పర్యవేక్షించటానికి కు GHMC నడుం బిగించింది. దీంట్లో భాగంగా ఇకనుంచి రోడ్లపై గుంత పడిన మూడు రోజుల్లోగా మరమ్మతులు చేయాలని కుండా సిబ్బంది జీతాల్లో కోత తప్పదని కమిషనర్ లోకేశ్‌కుమార్ హెచ్చరికలు జారీచేశారు. రోడ్ల మరమ్మతులు చూడాల్సిన బాధ్యత ఈఈ, ఎస్‌ఈ, జడ్‌సీలదేనని, బాధ్యతలను విస్మరిస్తే పెనాల్టీ విధిస్తామని సర్కులర్‌ జారీ చేశారు. దీంతో అధికారుల్లో కలకలం రేగింది. వెంటనే ఆదరాబాదాగా చర్యలకు దిగుతున్నట్లుగా సమాచారం.

హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ నిత్యం రద్దీతో ఉంటాయి. ప్రతీరోజు వేలాది వాహనాలు నగర రోడ్లపై తిరుగుతుంటాయి. ఈక్రమంలో రోడ్లపై గుంతల్లో పడి ప్రమాదాలకు గురవ్వటం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా..రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను జీహెచ్‌ఎంసీ ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించినా రోడ్లపై ఉండే గుంతల పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. నగరంలోని అనేక రహదారులు గుంతలు, కంకర తేలి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. రోడ్లమీదకు రావాలంటేనే భయపడుతున్నారు. కానీ తప్పని పరిస్థితి.

ఈ క్రమంలో కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఆర్‌ఎంపీలో భాగంగా గ్రేటర్‌లోని 709 కి.మీల రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించారు. దీనికోసం ఐదేళ్ల కాల పరిమితికి రూ.1837 కోట్లు అంచనా వేశారు. రోడ్డుపై గుంత పడిన మూడు రోజుల్లోగా దాన్ని పూడ్చకపోతే అధికారులు సంబంధిత ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలి. స్పందించకపోతే ఫైన్ విధించాలి. దాదాపు అన్ని జోన్లలో పదుల సంఖ్యలో నోటీసులు జారీ చేసినా జరిమానాల విధింపు చాలా చాలా తక్కువగా ఉంది.

దీంతో రోడ్ల నిర్వహణ ఏజెన్సీలు దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. చాలా ప్రాంతాల్లో రహదారులపై నెలల తరబడి గుంతలు అలాగే ఉండిపోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీనిపై నగరవాసుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో ఇటీవల జరిగిన సమన్వయ సమావేశంలో రోడ్ల గుంతలపై చర్చ జరిగింది.

దీన్ని సీరియస్‌గా తీసుకున్న కమిషనర్ లోకేశ్‌కుమార్ వెంటనే స్పందించి సర్క్యులర్‌ జారీ చేశారు. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 9103 కిలోమీటర్ల రహదారులున్నాయి. ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన 709 కి.మీల రహదారులను మినహాయిస్తే మిగిలిన 8394 కిలోమీటర్ల రోడ్లు జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉన్నాయి. సీఆర్‌ఎంపీ రోడ్ల మెరుగుదలకు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. వెంటనే రోడ్లను మెరుగుపరచాలని కోరుతున్నారు.