నేటి నుంచి రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై పర్యటన
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజాక్షేత్రంలోకి పయనమవుతున్నారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజాక్షేత్రంలోకి పయనమవుతున్నారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజాక్షేత్రంలోకి పయనమవుతున్నారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ టూర్లో పర్యాటక ప్రదేశాలు, దేవస్థానాలు, ప్రాజెక్టుల్ని సందర్శిస్తారు. డ్వాక్రా మహిళల్ని, గిరిజనుల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ప్రకటించిన ఆమె… నేటి నుంచి వరుసగా మూడ్రోజుల పాటు నాలుగు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్, భూపాలపల్లి జయశంకర్, పెద్దపల్లి జిల్లాల్లో గవర్నర్ పర్యటన సాగుతుంది. ఈ టూర్లో పర్యాటక ప్రదేశాలు, దేవస్థానాలు, ప్రాజెక్టుల్ని సందర్శిస్తారు. డ్వాక్రా మహిళల్ని కలిసి సమస్యలు తెలుసుకోనున్నారు.
ఇవాళ హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో యాదాద్రి వెళ్లనున్న గవర్నర్… నరసింహస్వామిని దర్శించుకుంటారు. అక్కడ్నుంచి హన్మకొండకు వెళ్లి… రెడ్క్రాస్ సొసైటీ ఆవరణలో తలసేమియా బాధితుల కోసం అదనపు భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనుల్ని పరిశీలించే అవకాశముంది. అనంతరం ఫోర్ట్ వరంగల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ లైటింగ్ను తిలకిస్తారు. ఇవాళ రాత్రికి హన్మకొండలోని హరిత హోటల్ బస చేస్తారు.
రేపు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో గవర్నర్ పర్యటన కొనసాగుతుంది. భూపాలపల్లిలో మొక్కలు నాటి జనరిక్ మందుల షాప్ ప్రారంభిస్తారు. అక్కడ్నుంచి కాటారం మండలంలోని బోడగూడెం చేరుకుంటారు. గిరిజనులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు గవర్నర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తారు. మేడిగడ్డ లక్ష్మీ ప్రాజెక్ట్, పంప్హౌస్తో పాటు అన్నారం దగ్గర సరస్వతి బ్యారేజీ సందర్శించిన అనంతరం… రేపు రాత్రి రామగుండంలో బస చేయనున్నారు.
ఎల్లుండి గవర్నర్ తమిళిసై డ్వాక్రా మహిళలతో సమావేశం అవుతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం బసంత్నగర్లో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలోని క్లాత్ బ్యాగ్స్ తయారీ యూనిట్ పరిశీలిస్తారు. పెద్దపల్లిలో డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసే శానిటరి నాప్కిన్ యూనిట్ను కూడా సందర్శిస్తారు. పక్కనే ఉన్న కాసులపల్లి గ్రామంలో స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం ప్యాకేజ్-6 సందర్శిస్తారు గవర్నర్. ఎల్లుండి సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. మూడ్రోజుల పాటు నాలుగు జిల్లాల్లో గవర్నర్ పర్యటన రోడ్డుమార్గానే జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.