Weather Report : నేటి నుంచి వడగాల్పులు
తెలంగాణ రాష్ట్రంలో మరలా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మూడు, నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అయితే..మరలా ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి. మే 15వ తేదీ నుండి బుధవారం నుండి మే 18 తేదీ శనివారం వరకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాయువ్య, ఉత్తర భారత ప్రాంతాల నుంచి పొడిగాలులు వీస్తున్నాయని తెలిపింది.
దీనివల్ల టెంపరేచర్స్ పెరుగుతున్నాయని, 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి వేళ సాధారణంగా కన్నా 4 డిగ్రీలు టెంపరేచర్స్ అధికంగా రికార్డవుతున్నాయి. మే 13వ తేదీ సోమవారం రాత్రి హైదరాబాద్లో 30 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.
ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రియల్టైం గవర్నెన్స్ ( ఆర్టీజీఎస్) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వీలైనంత వరకు చల్లని ప్రదేశాల్లోనే ఉండాలని సూచించింది. రాజధాని హైదరాబాద్లో టెంపరేచర్స్ అధికంగా నమోదవుతున్నాయి.