కాళేశ్వరంకు సాయం చేయండి : 15వ ఆర్ధిక సంఘాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ వస్తున్న ఆర్థిక సంఘం ప్రతినిధులకు అందచేసేందుకు ప్రభుత్వం ఒక నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో 32 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు చేపడుతున్న బృహత్తర ప్రాజెక్టుకు నిధులిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది.
కాళేశ్వరం సందర్శించనున్న ఆర్ధిక సంఘం
15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ చేరుకుని పనులను పరిశీలిస్తారు. తర్వాత ప్యాకేజీ–6లోని పంప్హౌజ్ పనులను పరిశీలిస్తారు. అక్కడే ప్రాజెక్టు పనులపై చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్రావుతో కూడిన బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. అనంతరం మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల పనులను సంఘం ప్రతినిధులు పరిశీలించే అవకాశం ఉంది.
నిర్వహణకే భారీ నిధులు అవసరం
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పై ప్రాజెక్టులకు సంబంధించి 5 ఏళ్ల కాలానికి విద్యుత్,నిర్వహణ ఖర్చులు కింద రూ.40.170 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 4,627 మెగా వాట్లు విద్యుత్ అవసరం కాగా, ఇందులో 2020–21 సంవత్సరానికే విద్యుత్ చార్జీల కిందే రూ.2,310 కోట్లు మేర చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. మొత్తంగా ఐదేళ్లలో రూ.11,220 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు.ఈ నిర్వహణ భారాన్ని కేంద్రమే భరించేలా చూడాలని ప్రభుత్వం కోరనుంది.
ఇక ప్రాజెక్టు పనుల కోసం రూ.66,227 కోట్లతో ఒప్పందాలు జరగ్గా, ఇందులో రూ.35,787 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.28,291 కోట్ల మేర పనులు చేయాల్సి ఉంది.ఓఅండ్ఎంకు కేటాయించారు. ఇందులో రూ.9,874 కోట్ల మేర ఇప్పటికే తీసుకున్న రుణాలు అందాల్సి ఉంది. ఇవి పోనూ భవిష్యత్తు నిధుల అవసరాలు రూ.18,417 కోట్ల మేర ఉండనున్నాయి. ఇందులోనూ కొంత భారాన్ని కేంద్రం భరించాలని రాష్ట్రం కోరే అవకాశం ఉంది.
ఇప్పటికే నీతి ఆయోగ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సిఫార్సు చేసినా కేంద్రం ఎటువంటి సాయం అందించలేదు. ఇప్పుడైనా సానుకూల నిర్ణయం తీసుకుని సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 15 వ ఆర్ధిక సంఘాన్ని కోరనుంది.