పాదచారుల రక్షణ కోసం ఆకాశ వంతెనల నిర్మాణం : HMDA

  • Published By: murthy ,Published On : November 5, 2020 / 09:21 PM IST
పాదచారుల రక్షణ కోసం ఆకాశ వంతెనల నిర్మాణం : HMDA

skywalk projects at mehdipatnam and uppal :  హైదరాబాద్ నగరంలో పాదచారుల రక్షణ కోసం… నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆకాశ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ప్రయోగాత్మకంగా మొదట వాహన రద్దీ అధికంగా ఉండే మెహిదీపట్నం, ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద స్కైవాక్‌ (బోర్డు వాక్‌)లను నిర్మించే దిశగా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యాచరణ రూపొందించింది.

ఓవైపు రద్దీ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తూనే..మరోవైపు అక్కడి  ఉన్న కొద్ది పాటి ఖాళీ స్థలంలోనే బస్సుల రాకపోకలకు బస్టాండ్‌లు నిర్మించడంతో పాటు అక్కడే ప్రయాణికులు షాపింగ్‌ చేసేందుకు వీలుగా కమర్షియల్ కాంప్లెక్స్ లను కూడా అందుబాటులోకి  తీసుకొస్తోంది. రూ.59.67 కోట్ల అంచనా వ్యయంతో HMDA చేపట్టబోయే ఈ నిర్మాణాలు పూర్తయితే ఆయా ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోనున్నాయి.


వాహనాల సంచారం, జనాల రద్దీ కారణంగా రోడ్డు క్రాస్‌ చేసే సమయంలో పాదచారులు ప్రమాదాలు బారిన పడుతున్నారు. దీన్ని నివారించేందుకు స్కైవాక్‌లు నిర్మించాలని నిర్ణయించారు. తొలుత మెహిదీపట్నం, ఉప్పల్‌ జంక్షన్లను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు.

ఈ రెండు ప్రాజెక్టులు సక్సెస్ అయితే భవిష్యత్తులో మరిన్నిప్రాంతాల్లో నిర్మించనున్నారు. వీటి తర్వాత దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహా స్కైవాక్‌లు నిర్మించే ఆలోచన చేస్తున్నారు.


ఉప్పల్‌ జంక్షన్‌లో నిర్మించబోయే స్కై వాక్ ప్రాజెక్ట్ వివరాలు……
ఉప్పల్‌ జంక్షన్‌లో నాలుగు వైపులా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, స్టెయిర్ ‌కేసులు ఆరు ప్రాంతాల వద్ద ఏర్పాటు చేస్తారు. వీటికి అనుసంధానంగా 660 మీటర్ల పొడవు, 6.15 మీటర్ల ఎత్తు, నాలుగు మీటర్ల వెడల్పుతో వాక్‌వేను నిర్మించనున్నారు. దుకాణాలు, కియోస్క్ లు కూడా ఏర్పాటు చేస్తారు.  అలాగే ఉప్పల్‌ జంక్షన్‌లోని మెట్రో స్టేషన్‌ మొదటి లెవల్‌ (ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే అంతస్తు)కు అనుసంధానం చేస్తారు.   Uppal sky walkఉదాహరణకు వరంగల్‌ బస్సులు ఆగే ప్రాంతం వద్ద ఎస్కలేటర్లు ఎక్కిన వ్యక్తి వాక్‌వే మీదుగా నేరుగా మెట్రో స్టేషన్‌లోకి వెళ్లవచ్చు. అలాగే రామాంతపూర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న లిఫ్ట్‌ల నుంచి పైకి ఎక్కిన వ్యక్తి నేరుగా మెట్రో స్టేషన్‌కు వెళ్లవచ్చు. లేదంటే ఉప్పల్  ‌వైపు నడుచుకుంటూ రావొచ్చు. దీని ప్రాజెక్టు అంచనా వ్యయం–రూ.25.39 కోట్లు.

మెహిదీపట్నం లో నిర్మించబోయే ప్రాజెక్టు వివరాలు…..
గుడి మల్కాపూర్‌కు వెళ్లే చౌరస్తా నుంచి మెహదీపట్నం బస్టాండ్‌ మీదుగా పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే ఫ్లైఓవర్‌ కింది నుంచి మిలిటరీ స్థలం వైపు ఉన్న బస్టాండ్‌ వరకు ఈ స్కైవాక్‌ (బోర్డు వాక్‌) నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ఫ్లైఓవర్‌ పైనుంచి అటు, ఇటు బస్టాండ్‌లను కలుపుతూ ఓ ఆకృతి సరికొత్తగా ఉండేలా ప్లాన్‌లు సిద్ధం చేశారు.  ఈ స్కైవాక్  380 మీటర్లు పొడవు, 3.6 మీటర్ల వెడల్పు ఉంటుంది. 16 లిఫ్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు.



రైతుబజార్‌ నుంచి మెహిదీపట్నం బస్టాండ్‌ వరకు మరో స్కైవాక్‌ను కూడా అనుసంధానం చేస్తారు. అయితే పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే కింది నుంచి ఉండే స్కైవాక్‌కు కలుపుతారు. దీంతో గుడి మల్కాపూర్‌ నుంచి వచ్చిన జనాలు, ఇటు రైతు బజార్, ఆసిఫ్‌నగర్‌ నుంచి వచ్చిన జనాలు అదే స్కైవే మీది నుంచి వెళతారు.
mehedipatnam sky walkబోర్డువాక్‌ వైపు నిలువు కనెక్టివిటీని ఒక గాజు ఎన్‌క్లోజర్‌ (మాడ్యూల్స్‌) ద్వారా ప్రవేశ పెడతారు. ఇందులో మెట్లు, లిఫ్ట్‌లు ఉంటాయి. ఇరువైపులా ఎత్తు 2.5 మీటర్ల స్టీల్‌ గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తారు. 12 మి.మీ మందపాటి పటిష్టమైన గ్లాస్‌ ప్లేట్ ‌లను స్పష్టమైన దృష్టి కోసం ఏర్పాటు చేయనున్నారు.

రైతు బజార్‌ పక్కన ఉన్న 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బస్‌ బే ఉండే విధంగా, పై అంతస్తులో వాణిజ్య సముదాయం నిర్మించనున్నారు. ప్రయాణికుల షాపింగ్‌కు ఇది వేదిక కానుంది. మెహిదీపట్నం ప్రాజెక్ట్‌ వ్యయం రూ.34.28 కోట్లు గా అంచనా వేశారు.