ముంచుకొచ్చిన ముప్పు.. నిజాం పాలనలో నాలా వ్యవస్థ ఎలా ఉండేది?

  • Published By: sreehari ,Published On : October 14, 2020 / 09:15 PM IST
ముంచుకొచ్చిన ముప్పు.. నిజాం పాలనలో నాలా వ్యవస్థ ఎలా ఉండేది?

వర్ష బీభత్సం ఇప్పుడే కాదు.. ప్రతి ఏటా కొనసాగుతూనే ఉంది. చినుకు పడితే నగరం చిత్తడవుతుంది.. కుండపోత వానతో నగరం అతలాకుతలం అవుతోంది. ఈ వరద ముప్పును నివారించేందుకే ప్రభుత్వం ఏకంగా 26వేల కోట్లను ఖర్చుపెడుతోంది.



ఇంత భారీగా ధనం వ్యయం కావడానికి హైదరాబాద్ మహానగర డ్రైనైజీ వ్యవస్థ అస్తవ్యస్తం కావడమే కారణం. ఎప్పుడో నిజాం కాలంనాటి నాలా వ్యవస్థని కొన్ని దశాబ్దాలుగా విస్తరించకపోవడంతోనే ఈ స్థితి దాపురించింది.
How Was Water drainage system in Nizam Rule of Hyderabad Cityనిజాం పాలనలో హైదరాబాద్‌లో 1221 కిలోమీటర్ల మేర నాలా వ్యవస్థ ఉండేది. అప్పట్లో 446 కిలోమీటర్ల మేర ఈ డ్రైనైజీ సిస్టమ్ విస్తరించింది.. కానీ ఇప్పుడో గ్రేటర్ సిటీగా మారిన నగరానికి ఈ నాల వ్యవస్థ ఏ మాత్రం సరిపోవడం లేదు. అందుకే నగర శివార్లతోపాటు.. సిటీ నడిబొడ్డున కూడా వర్షం పడితే మురుగు వరద నీటి ప్రవాహంలా పైకి తన్నుకొస్తుంది.

 2000లో ఆగస్ట్‌లో భారీగా వరదలు :
ఈ కారణంగా ఓపెన్‌ నాలాల్లో పడి మనుషుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ రీడిజైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం వేలాదిగా ఆక్రమణలకు గురైన చెరువులను, నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలి. 2000 సంవత్సరం ఆగస్ట్‌లో భారీగా వరదలు రావడంతో.. అప్పట్లోనే కిర్లోస్కర్ కమిటీ ఓ మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసింది.

ఆ కమిటీ నివేదిక ప్రకారం సిటిలో నాలాలపై కొన్ని వేల నిర్మాణాలు జరిగాయని తెలిసింది. ఈ ఆక్రమణలకు తోడు గ్లోబల్ వార్మింగ్, భారీ వర్షాలకు నగర యంత్రాంగం సిద్ధం కాకపోవడంతో రోడ్లపై భారీ వరదనీరు చేరుతోంది.



గత నెలలో కురిసిన వర్షాలకు వరద నీటిలో పడి చిన్నారి సుమేధ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ప్రభుత్వం ఓపెన్‌నాలాలపై పైకప్పులు నిర్మిస్తామని ప్రకటించింది. 300కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ ఏం లాభం.. జీహెచ్‌ఎంసీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.



భారీ వర్షాలు పడ్డా.. వరదలు పోటెత్తినా జీహెచ్‌ఎంసీ తాత్కాలిక ఉపశమన చర్యలు మాత్రమే చేపడుతూ వస్తోంది. ఈ కారణంగానే చినుకు పడితే గంటలకొద్ది వాహనదారులు రోడ్లపై నరకం చూస్తారు. కిలోమీటరు దూరం ప్రయాణం చేయాలంటే గంటకు పైగా సమయం పడుతుందంటే డ్రైనేజీ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.

రూ.400కోట్లతో సీవరేజీ పనులు ప్రారంభం
నిజాం కాలం నాటి పైపులైన్లను రీస్టోర్ చేసేలా.. ఏయే ప్రాంతాల్లో పనులు చేపట్టాలనేది జీహెచ్ఎంసీ గతంలోనే గుర్తించింది. దశలవారీగా సీవరేజీ వ్యవస్థను మెరుగుపరిచేలా 2008లో అధికారులు పనులు మొదలుపెట్టారు.

400 కోట్ల రూపాయల అంచనాలతో సీవరేజీ పనులు చేపట్టారు. కానీ మధ్యలోనే వదిలేశారు. నిర్మాణ వ్యయం రెట్టింపు కావడంతో చేతులెత్తేశారు. దీంతో సీవరేజీ నిర్వహణ మరింత దారుణంగా మారింది. చిన్నపాటి వర్షానికే ఏ గల్లీలో చూసినా డ్రైనేజీ నీళ్లు పారుతూనే ఉన్నాయి.



మ్యాన్ హోళ్లను క్లీన్​చేసేందుకు జెట్టింగ్ యంత్రాలను వినియోగిస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు. నగరంలో వర్షం పడిందంటే చాలు..ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితి. ఎక్కడ నాలా ఉందో.. ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉందో తెలియదు.

నగరజీవికి వర్షం పడితే నరకమే కన్పిస్తుంది. విశ్వనగరంగా రూపు దిద్దుకుంటున్న హైదరాబాద్‌కు ఈ విపత్తులు ఎన్నో సవాళ్లు విసురుతున్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే కచ్చితంగా ఓ యాక్షన్ ప్లాన్ కావాలి.