కొరియర్ పార్శిల్ లో చనిపోయిన పిండం..షాక్ అయిన సిబ్బంది

కొరియర్ పార్శిల్ లో చనిపోయిన పిండం..షాక్ అయిన సిబ్బంది

Hyderabad Cargo Services Dead fetus in courier parcel: కొరియర్ పార్శిల్స్ లో పేపర్స్, వస్తువులు, సరుకులు ఇలా ఎన్నో పంపిస్తుంటారు. కానీ ఏకంగా పిండాలను అదికూడా చనిపోయిన పిండాల్ని కొరియర్ పార్శిల్స్ లో పంపించిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. తెలంగాణా ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న కార్గో సర్వీస్ లో ఈ దారుణ ఘటన బైటపడింది. అది చూసిన సిబ్బంది షాక్ అయ్యారు. ఆ పిండం దుర్వాసన వస్తుండటంతో ఈ విషయం బైటపడింది.

అది హైదరాబాద్ లోని ఎంజీబీఎస్. టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న కార్గో సర్వీస్ కౌంటర్. తమ దగ్గరకు వచ్చిన అన్ని పార్శిళ్లను సిబ్బంది ఓ వరుసగా పెడుతున్నారు. ఒక్కొక్క పార్శిల్ ఎక్కడ నుంచి వచ్చింది..? ఎక్కడకు వెళ్లాలి.? వాటిని ఏఏ ప్రాంతాలకు పంపించాలి? అనే వివరాలన్ని రాసుకుంటున్నారు.

అలా లిస్టు తయారు చేసుకుంటున్న సిబ్బందికి ఓ పార్శిల్ నుంచి తీవ్ర దుర్వాస వచ్చింది. ఆ వాసన భరించలేకపోయారు. ఏ పార్శిల్ నుంచి దుర్వాసన వస్తోందో వెదికి గుర్తించారు. అంత దుర్వాసన వస్తుండటంతో వారికి అనుమానం వచ్చింది. అసలు దాంట్లో ఏముందోనని చూద్దామని ఓపెన్ చేశారు. అంతే దాంట్లో కనిపించింది చూసి షాక్ అయ్యారు. ఆ పార్శిల్ లో ఓ మృత పిండం కనిపించింది. అది కుళ్లిపోతున్నట్లుగా ఉంది. దాంతో సిబ్బంది అంతా షాక్ నుంచి త్వరగా కోలుకోలేకపోయారు. అది ఎక్కడ నుంచి వచ్చింది చూసారు. నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా రివర్ డయాగ్నస్టిక్ సెంటర్ అని ఉంది.

రివర్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఓ మృతపిండాన్ని హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించాలనుకున్నారు. అటువంటివి పంపించాలంటే ప్రత్యేక వాహనం ద్వారానో, అంబులెన్స్ ద్వారానో తరలించాలి. కానీ ఆ డయాగ్నస్టిక్స్ నిర్వాహకులు మాత్రం తక్కువ ఖర్చుతో అయిపోతుందనుకున్నారో ఏమోగానీ..ఆ పిండాల్సిన పార్శిల్ ద్వారా పంపించారు.

నల్లగొండ జిల్లాలోని ఆర్టీసీ బస్సుల ద్వారా కార్గో సర్వీసులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కార్గో సర్వీసుల ద్వారా ఆ మృత పిండాన్ని పంపించాలనుకుని ఓ పార్శిల్ కట్టి, ఆ పార్శిల్ ను ఓ సిమెంట్ బస్తాలో పెట్టి గట్టిగా కట్టి హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ పార్శిల్ కేంద్రానికి పంపించారు. నల్లగొండ జిల్లాలోని కార్గో సర్వీసు సిబ్బందికి దాంట్లో ఏముందో తెలియక ఆ పార్శిల్ ను తీసుకెళ్లారు.

హైదరాబాద్ కు వచ్చేసరికి ఆ మృతపిండం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బటయపడింది. హైదరాబాద్ కు చెందిన ఓ ల్యాబ్ వాళ్లు కార్గో కేంద్రానికి వచ్చి ఆ పార్శిల్ ను తీసుకెళ్లారు. ఈ ఘటన గత డిసెంబర్ 23న జరిగింది. కానీ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేశారు. అయినా గత శుక్రవారం ఇది వెల్లడైంది.

ఈ విషయమై నల్లగొండ లోని డయాగ్నస్టిక్స్ నిర్వాహకులను ప్రశ్నించగా.. అలా పంపిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించడం గమనించాల్సిన విషయం. ఇలా ఓ మృతపిండాన్ని కార్గో సర్వీసు ద్వారా తరలించిన సంగతి నిజమేనని నల్లగొండ జిల్లా ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ శ్యామల అంగీకరించారు. అయితే నిబంధనల ప్రకారం ఇలా మృతపిండాలను తరలించకూడదని..కొన్ని రకాల ల్యాబ్ పరీక్షలకు మాత్రమే దీన్ని పాటించాల్సి ఉంటుందని సూచించారు.

కాగా డయాగ్నస్టిక్స్ నిర్వాహకులపై ఏమైనా చర్యలు తీసుకుంటారా..? అన్నదానిపై మాత్రం వివరాలు తెలియలేదు. ఏది ఏమైనా సాధారణ పార్శిళ్లకు ఉపయోగించాల్సిన ఈ కార్గో సర్వీసుల్ని ఇలా మృతపిండాలను తరలించడం బైటపడటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.