మెట్రోరైలులో ఆన్లైన్ టికెట్లు: కరోనా భయం వద్దు
మెట్రో రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆన్ లైన్ టికెట్ విధానాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రవేశ పెట్టారు. పేటియం భాగస్వామ్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ ఆండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఎండీ కేవీబి రెడ్డి, పేటియం వైస్ ప్రెసిడెంట్ అభయ్ శర్మ, మరికొందరు అధికారులు గురువారం లాంఛనంగా దీన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ డిజిటల్ లావాదేవీల్లో ముందజలో ఉందన్నారు. ప్రయాణికులు ఎక్కువ సమయం లైన్లో నిలబడి టికెట్లు తీసుకునే అవసరం లేకుండా పేటియం కల్పిస్తున్న నూతన సదుపాయాలతో మరింత సౌకర్యవంతగా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చన్నారు. డిజిటల్ మార్కెట్లో దేశంలోనే పేటియం ఎంతో పెద్ద సంస్థ అని ఆయన అన్నారు. అలాగే గత మూడు నెలల కింద వినియోగంలోకి తీసుకువచ్చిన క్యూఆర్ కోడ్ టికెటింగ్ విధానం ఉపయోగిస్తున్న వారి సంఖ్య నేడు రోజుకు 60 వేలకు చేరిందన్నారు.
పేటియం ద్వారా స్మార్ట్ కార్డును రీచార్జ్ చేసుకోవడంతో పాటు కార్డు లేని వారు కూడా టికెట్ బుక్ చేసుకుని ఆన్లైన్ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణించవచ్చన్నారు. దీంతో పాటు అదే యాప్ ద్వారా మెట్రో, ఫీడర్ బస్సులలో ప్రయాణం చేయవచ్చన్నారు. రాబోయే రోజుల్లో తాము ఆర్టీసీ, ఊబర్ వంటి ప్రైవేటు సంస్థలతో కూడా ఒప్పందాలు చేసుకుని ఒకే టికెట్తో ప్రయాణం చేసేలా సదుపాయాలు తెచ్చే అవకాశాలున్నాయని వివరించారు. రెండు మూడు వారాల్లో పాస్లను కూడా తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అనంతరం పేటియం ప్రతినిధులు టికెట్ బుక్ చేసుకునే విదానాన్ని డెమో రూపంలో చూపించారు. రసూల్పుర మెట్రో స్టేషన్లో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్వయంగా పేటియంని వాడి చూపించారు.
కరోనా గురించి భయపడవద్దు
ప్రజలు మెట్రో రైలులో ప్రయాణించేప్పుడు కరోనా వైరస్ గురించి భయ పడవద్దని మెట్రో ఎండీ చెప్పారు. కరోనా వచ్చిన వారిలో రోగ నిరోదక శక్తి లేని చాలా తక్కువ శాతం మంది మాత్రమే చనిపోతున్నారని వివరించారు. మెట్రో రైలును ప్రతిరోజు పూర్తిగా ఆర్ 2 కెమికల్ శానిటైజర్లతో శుభ్రం చేస్తున్నట్లు, పార్ట్ టు పార్ట్ ప్రతి చోట స్టేషన్తో సహా శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే 10 రోజుల్లో మరో 2 కొత్త రైళ్ళను అందుబాటులోకి తేనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
See Also | ముహూర్తం ఖరారు : 20న నిర్భయ దోషులకు ఉరిశిక్ష