న్యూయర్ మెట్రో గుడ్ న్యూస్ : ఒంటిగంట వరకూ ట్రైన్..మందుబాబులు కూడా ఎక్కొచ్చు 

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 10:20 AM IST
న్యూయర్ మెట్రో గుడ్ న్యూస్ : ఒంటిగంట వరకూ ట్రైన్..మందుబాబులు కూడా ఎక్కొచ్చు 

న్యూయర్ మెట్రో గుడ్ న్యూస్ : ఒంటిగంట వరకూ ట్రైన్..మందుబాబులు కూడా ఎక్కొచ్చు 
హ్యాపీ న్యూ ఇయర్ కు ఇంకా కొన్ని గంటలే ఉంది. ఈ సందర్బంగా హైదరాబాద్ నగర వాసులకు మెట్రో ట్రైన్ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 రాత్రి మెట్రో ట్రైన్ సర్వీసులు ఒంటి గంట వరకూ నడుస్తాయని తెలిపారు. న్యూ ఇయర్  సందర్భంగా  చివరి మెట్రో ట్రైన్ ఒంటి గంటకు ఉంటుందని తెలిపారు. మద్యం సేవించినవారు కూడా మెట్రో ట్రైన్ లో ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. 
అలాగే న్యూ ఇయర్ సందర్భంగా రేపు రాత్రి అంటే డిసెంబర్ 31 రాత్రి ఒంటి గంట వరకూ కూడా ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో అర్థరాత్రి ఒంటి గంటకు లింగంపల్లి నుంచి చివరి రైలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. 

పోలీసుల కళ్లు మీపైనే జాగ్రత్త..
పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఏడాదికి స్వాగతం చెబుతూ ఉత్సాహంగా గడుపుతారు. పార్టీలు..అర్థరాత్రి కేక్‌ కట్ చేసి విషెస్ జరుపుకుంటారు. ఇక యువత గురించి చెప్పక్కర్లేదు. వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. బైక్ లు, కార్ల మీద తిరుగుతూ న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెబుతారు. కేరింతల్లో మునిగితేలుతారు. 

న్యూఇయర్ సెలబ్రేషన్స్ రోజున రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఏటా వీటిని తగ్గించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈసారి కూడా అందుకోసం రూల్స్ తీసుకొచ్చారు. 2020 వేడుకల్లో… రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు, అపశ్రుతులకు ఆస్కారం లేకుండా.. ప్రశాంతంగా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. పోలీసులు జారీ చేసిన నిబంధనలను ఈవెంట్స్‌ నిర్వాహకులు, హోటల్స్‌, పబ్‌ యాజమాన్యాలు, ఇతరులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. మహిళలకు పటిష్ట భద్రత, రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా.. రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు విజన్‌ 2020 లక్ష్యాలను వివరించారు.

తాగి నడిపిన మందుబాబులకు చుక్కలు చూపించేందుకు పోలీసులు రెడీ 
డిసెంబర్ 31 రాత్రి.. న్యూ ఇయర్ వేడుకల పేరుతో భారీగా మద్యం తాగుతారు. అలా తాగి సైలెంట్ గా ఉంటే ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. కానీ బైక్ లు, కార్లు వేసుకుని రోడ్డెక్కుతామంటే మాత్రం ఊరుకునేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి మందుబాబుల తాట తీసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. తాగి వాహనాలు నడిపే వారికి చుక్కలు చూపిస్తారు. డిసెంబర్ 31న రాత్రి స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ లు నిర్వహించనున్నారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడితే రూ.10 వేల భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేయనున్నారు.

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తాగుబోతుల కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. దీంతో ఈ ఏడాది ఆలా జరగకూడదనే ఉద్దేశ్యంతో వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు జరక్కుండా నగర పోలీసులు పలు నిబంధలు విధించారు. ఇందులో భాగమే రూ.10వేలు ఫైన్, వాహనం సీజ్. ఇవండి.. పోలీసులు విధించిన కొత్త రూల్స్. సో.. బీ కేర్ ఫుల్. ఎక్కడా హద్దులు దాటకుండా న్యూఇయర్ వేడుకులను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి.