ఎండలు పెరిగితే కరోనా తగ్గుముఖం పడుతుంది
కరోనా వైరస్ గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు హైదరాబాద్ కు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు. ఇటలీ, ఇరాన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్లో కొత్త కేసుల రేటు చాలా తక్కువగా ఉండటం దీనికి ఓ కారణమని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ చెప్పారు.
మరో రెండు మూడు వారాల్లో కేసుల సంఖ్య ఎక్కువైనా.. ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా. అమెరికా, బ్రిటన్లో కరోనా వైరస్ వ్యాప్తి, ఆస్పత్రిలో చేరేవారు.. మరణాల గురించి ఇప్పటికే కొన్ని కంప్యూటర్ ఆధారిత మోడల్స్ వచ్చాయని, వాటి ప్రకారం ఆయా దేశాల్లో కొన్ని లక్షల మంది మరణిస్తారన్న అంచనాలు ఉన్నా.. అవేవీ భారత్కు వర్తించవని స్పష్టం చేశారు.
మన భారత దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, ప్రజల సాధారణ రోగ నిరోధక వ్యవస్థ పనితీరు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కరోనా వైరస్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారానికల్లా కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరుకుని.. రెండు, మూడు వారాల తర్వాత తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు.
కరోనా వైరస్ ప్రభావం వృద్ధుల్లోనే ఎక్కువని పేర్కొన్నారు. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలే 25 డిగ్రీలు ఉంటుందని……25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా క్రిములు తట్టుకోలేవని..అవి చనిపోతాయని కొందరు శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
గతేడాది డిసెంబర్లో చైనాలోని వూహాన్లో తొలిసారి కరోనా వైరస్ను గుర్తించగా జనవరి నెలాఖరుకు అక్కడి ప్రభుత్వం.. రవాణాపై ఆంక్షలు విధించిందని శ్రీవారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆ తర్వాత కేసు లు తగ్గుముఖం పట్టాయని, భారత్తో పాటు ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనావేశారు.
దేశంలోని దాదాపు 15 రాష్ట్రాల్లో వైరస్ నియంత్రణ చర్యలు ముమ్మరంగా చేపట్టారని, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్,స్కూళ్లు, కాలేజీలు, స్విమ్మింగ్ పూల్స్ మూసేశారని ఈ చర్యల ఫలితం త్వరలోనే కనిపిస్తుందని చెప్పారు.
ఐఐసీటీలోనూ తాము వైరస్ నియంత్రణకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో రోజుకు నమో దవుతున్న కొత్త కరోనా వైరస్ కేసులు 10 కంటే తక్కువ ఉన్నాయని, దీన్నిబట్టి చూసినా ఆందోళన అవసరం లేదన్నది స్పష్టమవుతోందని చెప్పారు. చల్లటి వాతావరణం ఉన్న దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని.
మనలాంటి ఉష్ణోగ్రత దేశాలలో ఈ ప్రమాదం తక్కువ అని…. ఉష్ణోగ్రతల పెరుగుదలతో కరోనా వైరస్కు అడ్డుకట్ట పడుతుందని కొందరు చెబుతున్నారని పేర్కొన్నారు. కాకపోతే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కన్పిస్తే ప్రజలు ఇతరులతో కలవడాన్ని తగ్గించాలని, వైద్యులను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.