COVID లక్షణాలు కనిపించే వారి కంటే కనిపించకపోతేనే ఇబ్బందులెక్కువ
కొవిడ్ లక్షణాలు కనిపించే వారి కంటే.. ఎటువంటి లక్షణాలు కనిపించని బాధితుల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ రకం వైరస్ ఉన్నట్లు తేలింది. మే, జులై నెలల్లో గ్రేటర్ సహా… శివారు ప్రాంతాల్లో కొవిడ్ బారిన పడిన 210 మంది డేటాను సేకరించి విశ్లేషించగా ఈ విషయం స్పష్టమైంది.
వైరస్లోడుకు తోడు…అదేస్థాయిలో ఇమ్యునిటీ లెవల్స్ ఉండటం వల్లే ఆరోగ్యంగా బయటపడినట్లు స్పష్టం చేసింది. వీరి నుంచి ఇమ్యునిటీ లెవల్స్ తక్కువగా ఉన్న వారికి వైరస్ వ్యాపించి మృత్యువాతకు కారణమైనట్లు గుర్తించింది.
లక్షణాలు కనిపించని వారు 70 శాతం మంది:
GHMC పరిధిలో ఇప్పటి వరకు 57 వేల మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం లక్షణాలు కనిపించకుండా ఉన్న 70 శాతం మందిలో 30 శాతం మందిలో మాత్రం జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కన్పించాయి. కొవిడ్ లక్షణాలు కనిపించే వారితో పోలిస్తే…ఏ లక్షణాలు కనిపించని బాధితుల్లోనే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇటువంటి వారి నుంచే వృద్ధులు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి విస్తరించి, పరోక్షంగా మృత్యువాతకు కారణమవుతున్నట్లు తేలింది. ఈ పరిశోధన వివరాలు ‘బయో ఆరెక్సీవ్’ అనే ప్రీప్రింట్ రీపాజిటరీలో ఇటీవల పబ్లిష్ కావడం గమనార్హం.
ఐదు శాతం మందిలోనే ఇతర వైరస్
నగరంలోని కొవిడ్ బాధితుల నుంచి సేకరించిన నమూనాల్లోని జీనోమ్ సీక్వెన్స్ డేటాను పరీక్షించగా, వైరస్ జీనోమ్లో ఎక్కువ మ్యుటేషన్లు జరిగినట్లు గుర్తించారు. 95 శాతం మందిలో 20 బిక్లేడ్ అనే స్ట్రెయిన్కు చెందిన కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. కేవలం ఐదు శాతం మందిలో మాత్రమే ఇతర స్ట్రెయిన్లకు చెందిన వైరస్ ఉన్నట్లు తేలింది.