మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 12:10 PM IST
మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది

హైదరాబాద్ : దేశంలో ప్రధాని మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పలువురు నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోడీకి లాభం చేకూరుతుందని.. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం చేకూరుతుందని.. అదే 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం చేకూరుతుందని కేటీఆర్ చెప్పారు.
Read Also : పోటీకి పంపండి : గోరంట్ల మాధవ్ కు కోర్టు లైన్ క్లియర్…

తెలంగాణ హక్కుల సాధన కోసం పేగులు తెగేదాక కొట్లాడే దమ్మున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ గులాంలు కావాలో? తెలంగాణ గులాబీలు కావాలో? తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగిందేమీ లేదన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉన్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో మోడీ హవా తగ్గిందని, ఎన్డీయేకు 150, యూపీఏకు 100 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ చెప్పారు.

టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీని శాసించాలన్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోందని, పార్టీని నడిపే దమ్ములేక కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు తెల్లారి లేచింది టీఆర్ఎస్ ను తిడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను విమర్శించే చంద్రబాబు.. ఆయన పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ పేరు పెట్టారని అన్నారు.
Read Also : చంద్రబాబు సెటైర్: ఫ్యాన్ ఏపీలో.. స్విచ్ హైదరాబాద్‌లో.. కరెంట్ ఢిల్లీలో