టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ : ప్రచారానికి కేటీఆర్ రెడీ

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 03:08 PM IST
టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ : ప్రచారానికి కేటీఆర్ రెడీ

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గ్రేటర్‌లో ప్రచార బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించిన కేటీఆర్… నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక.. పూర్తి స్థాయి ప్రచారాన్ని చేపట్టే అవకాశం ఉంది.

16 ఎంపీ స్థానాలే లక్ష్యంగా టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రచారాన్ని ప్రారంభించేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. భారీ మెజారిటే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు.

ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌పై కేటీఆర్ దృష్టిపెట్టారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పరిధిలో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తీసుకున్నట్లే ప్రచార బాధ్యతలను తీసుకుంటున్నారు. 2019, మార్చి 25న నామినేషన్లకు తుది గడువుగా ఉంది. ఆ గడువు ముగిసిన వెంటనే… గ్రేటర్‌లో కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తారు.

గ్రేటర్ టూర్‌లో రోడ్ షోలు ఉంటాయి. ప్రతీ రోజు… రోడ్ షో.. బహిరంగ సభ ఉండేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. రోజు ఒకటి లేదా.. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం ఉంటుంది. ఒక్కో చోట కనీసం 25వేల మంది ఉండేలా జన సమీకరణ చేయాలని ఇప్పటికే నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలకు ఆదేశాలు అందాయి. బహిరంగ సభలకంటే కూడా.. రోడ్ షో లే బెటర్ అని మెజారిటీ శాతం నేతలు సూచనలు చేయడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేటీఆర్ గ్రేటర్ ప్రచారం కోసం.. ప్రత్యేకంగా వాహనాన్ని సిద్ధం చేశారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఎక్కువగా దృష్టి పెడుతుండటంతో… సారు.. కారు.. పదహారు అనే నినాదంతో వెహికల్‌ను ముస్తాబు చేశారు. సాయంత్రాల్లోనే రోడ్ షోలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో.. ఉదయం వేళల్లో జిల్లాల్లో ప్రచారం చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.