హైటెక్ సిటీకి ’మెట్రో’ పరుగులు
సైబర్సిటీలో కూత పెట్టేందుకు మెట్రో సిద్ధమైంది. హైటెక్ సిటీకి నేటి నుంచి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది.
సైబర్సిటీలో కూత పెట్టేందుకు మెట్రో సిద్ధమైంది. హైటెక్ సిటీకి నేటి నుంచి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది.
హైదరాబాద్ : సైబర్సిటీలో కూత పెట్టేందుకు మెట్రో సిద్ధమైంది. ఐటీ ఎంప్లాయిస్కి కూల్ అండ్ సేఫ్ జర్నీ అందించే మెట్రోను గవర్నర్ నరసింహన్ మరికొద్ది గంటల్లో ప్రారంభించనున్నారు. మార్చి 20 బుధవారం సాయంత్రం నుంచి ఐటీ కారిడార్లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్లో మెట్రో రైలు మరో మెట్టు ముందుకేసింది. హైటెక్ సిటీకి నేటి నుంచి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. తొలిదశలో మొత్తం 72 కి.మీలలో 46 కిలోమీటర్ల వరకు సేవలు అందించిన మెట్రోరైలు మరో 10 కిలోమీటర్లు సేవలు అందించనుంది. దీంతో మూడో కారిడార్ పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్టైంది.
సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ఐటీ ఎంప్లాయిస్ హైటెక్ మాదాపూర్ ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రధానంగా ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్ నుండి వచ్చేవారు, లక్డికాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి వెళ్లేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు. మెట్రో రైలు ప్రారంభమవుతుండటంతో వారి కష్టాలకు బ్రేక్ పడనుంది. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వరకు పది కిలోమీటర్లలో మొత్తం తొమ్మిది స్టేషన్లున్నాయి. ప్రస్తుతం మెట్రో ట్రైన్స్ రన్ అవుతున్న స్టేషన్లో ప్రతి ఆరు నిమిషాలకు ఒక ట్రైన్ మూవ్ అవుతుంది. అయితే అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు ప్రతి 9 నుండి 12 నిమిషాలకు ఒక ట్రైన్ నడపనున్నారు.
అయితే కొత్తగా ప్రారంభమవుతున్న మెట్రోరైలు జూబ్లీహిల్స్, పెద్దమ్మ టెంపుల్, మాదాపూర్ స్టేషన్లలో ఆగదని అధికారులు తెలిపారు. హైటెక్ సిటీ వరకు వెళ్లిన ట్రైన్కు రివర్సల్ వ్యవస్థ లేక పోవడంతో మూడు స్టేషన్లలో ప్రస్తుతం మెట్రో రైలు ఆగదు. ఈ రూట్లో అత్యధికంగా మూలమలుపులు ఉండటంతో స్పీడు తగ్గించాల్సి వస్తుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. అయితే అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ట్రైన్ నిలపకపోవడంతో ప్రయాణికులు ముందు స్టేషన్లో దిగాల్సిన పరిస్థితి.. ఈ రూట్లో రివర్సల్ వ్యవస్థ పూర్తయ్యే వరకు ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడకతప్పదని అధికారులు చెబుతున్నారు.