గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు

  • Published By: murthy ,Published On : November 24, 2020 / 07:05 AM IST
గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు

Minister ktr road show for ghmc elections : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో నిలిచింది ఎవరో తేలింది. గ్రేటర్‌లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్‌ఎస్‌ 150స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో అన్ని డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీలోఉన్నారు. ఇక బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తోంది. నవాబ్‌ సాహెబ్‌కుంటలో తప్ప మిగతా చోట్ల అభ్యర్థులను బరిలో నిలిపింది.

ఇక కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను 146 డివిజన్లలో పోటీలోఉంచింది. నాలుగు డివిజన్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలోనుంచి తప్పుకున్నారు. ఇక టీడీపీ 106 చోట్ల పోటీ చేస్తోంది. మజ్లిస్‌ 51 డివిజన్లలో తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక సీపీఐ 17 చోట్ల పోటీ చేస్తుండగా…. సీపీఎం మాత్రం 12 డివిజన్లలో పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపింది.



ఇతర రాజకీయ పార్టీలు 76 చోట్ల పోటీ చేస్తుండగా… స్వతంత్రులు 415 మంది వివిధ డివిజన్లలో…. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అత్యధికంగా జంగంమెట్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక అత్యల్పంగా ఉప్పల్‌, బార్కాస్‌, నవాబ్‌షాహెబ్‌కుంట, టోలీచౌక్‌, జీడిమెట్లలో డివిజన్లలో ఉన్నారు. ఇక్కడ ఒక్కోచోట కేవలం ముగ్గురు అభ్యర్థులే పోటీలో ఉన్నారు.
https://10tv.in/chiranjeevi-and-nagarjuna-thanking-to-telangana-cm-kcr/
బల్దియా ఎన్నికల్లో మొత్తం 2,900లకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తిరస్కరణ, ఉపసంహణ తర్వాత మొత్తంగా ఎంతమంది బరిలో నిలిచారనే వివరాలను అధికారులు ప్రకటించారు.



ఇక గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూసుకెళ్తోంది. ప్రచార బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్న కేటీఆర్… ఒంటిచేత్తో అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తున్నారు. ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేస్తూ.. ప్రచారంలో హీట్‌ పెంచుతున్నారు. రోజూ రెండు నియోజకవర్గాల్లను చుట్టేస్తున్న ఆయన… టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఏం చేస్తామన్నది వివరిస్తూ ఓట్లడుతున్నారు.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గ్రేటర్‌ను చుట్టేస్తున్నారు. బల్దియాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకు ఓట్లడుతున్నారు. సోమవారం ఆయన మహేశ్వరం, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.



పలుచోట్ల రోడ్‌షోలలో ప్రసంగించిన కేటీఆర్‌… ప్రతిపక్షాలపై విమర్శలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వోకల్‌ -లోకల్‌ అంటున్నారని…. తెలంగాణలో ఎవరు లోకల్‌ అని సభకు వచ్చిన వారిని ప్రశ్నించగా టీఆర్‌ఎస్‌ అని సమాధానం వచ్చింది. గ్రేటర్‌ ప్రజలకు ఎవరు కావాలో నిర్ణయించుకోవాలన్నారు. హైదరాబాద్‌ గులాబీలు కావాలా… గుజరాత్‌ గులామ్‌లు కావాలో తేల్చుకోవాలన్నారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు ఎన్నో ఇచ్చామంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారో అడగాలని ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలు ఆరేళల్లో రెండు లక్షల 70వేలకు పైగా పన్నుల రూపంలో కేంద్రానికి కడితే… ఇచ్చింది అందులో సగమేనని విమర్శించారు.



బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. నోటికి అద్దూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యువకుల బైక్‌ చాలాన్లు చెల్లిస్తామని సంజయ్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చలాన్లు ప్రభుత్వమే కడుతోందా అని ప్రశ్నించారు. అసలు చలాన్ల విధానం తీసుకొచ్చింది బీజేపీయేనని దుయ్యబాట్టారు.

తెలంగాణ బీజేపీ నేతలు చార్జిషీట్‌ వేయడాన్ని కేటీఆర్‌ తీవ్రంగా తప్పుపట్టారు. చార్జిషీట్‌ వేయాల్సి వస్తే… బీజేపీపైనే వేయాలన్నారు. బీజేపీ చెప్పిన ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేదన్నారు. చార్జిషీట్లు గనుక వేయాల్సి వస్తే.. దేశంలోని 132 కోట్ల మంది బీజేపీ ప్రభుత్వంపైనే వేయాల్సి ఉంటుందన్నారు.



హైదరాబాద్‌ వరదలపైనా బీజేపీ నేతలు నీచ రాజకీయానికి దిగారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఒక్కొక్కరికి 25వేలు ఇస్తామని బీజేపీ నేతలు చెప్పడం ఒట్టి బూటకమన్నారు. తాము పదివేలు ఇచ్చిన ఆరున్నర లక్షల మందికి 25వేలు చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ మంగళవారం కూడా మరో రెండునియోకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేస్తూ… ప్రచారంలో దూసుకెళ్తున్నారు.