నేడే  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు 

  • Published By: chvmurthy ,Published On : March 12, 2019 / 03:00 AM IST
నేడే  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు 

హైదరాబాద్:  రాష్ట్రంలో  నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు అసెంబ్లీలో నిర్వహిస్తారు. మండలిలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌ వన్‌లో పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు… అసెంబ్లీ దగ్గర భారీగా భద్రతా ఏర్పాట్లు చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఏ పార్టీ బలం ఎంత.. ఒక్కో ఎమ్మెల్సీ స్థానాన్ని గెల్చుకోవాలంటే అభ్యర్థులకు ఎన్ని ఓట్లు రావాలి ఒకసారి చూద్దాం. 

ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఐదింటినీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ స్కెచ్‌ వేసింది. టీఆర్ఎస్ 4 స్థానాల్లో పోటీచేస్తూ.. ఒక స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకి కేటాయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ గూడూరు నారాయణ రెడ్డిని ఆరో అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో.. ఎన్నికలు అనివార్యమయ్యాయి. అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యా బలం 88. దానికి తోడు ఒక ఇండిపెండెంట్‌తో పాటు ఫార్వార్డ్ బ్లాక్ నుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ సంఖ్య 90కి చేరింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కారెక్కేందుకు రెడీ అయ్యారు. దీంతో… టీఆర్ఎస్ బలం 94కి చేరింది. కాంగ్రెస్ మహిళా  ఎమ్మెల్యే హరిప్రియ కూడా టీఆర్ఎస్‌లో చేరతానంటూ ప్రకటించారు. మరోవైపు ఏడుగురు మజ్లిస్ సభ్యుల బలం ఏలాగూ ఉంది. వీటన్నింటితో పాటు నామినేటేడ్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఖాతాలోకే వస్తారు. దీంతో ఐదింటినీ గెల్చుకుంటామని గులాబీ టీమ్‌ ధీమాగా ఉంది. 

119 శాసనసభ్యులతో పాటు నామినేటేడ్ ఎమ్మెల్యేను కలిపితే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 120. ఒకవేళ వీరందరూ హాజరైతే ఒక్కో ఎమ్మెల్సీకి ప్రథమ ప్రాధాన్యం కింద 21 ఓట్లు రావాలి. సభ్యులెవరైనా రాని పక్షంలో అది తగ్గుతుంది. అయితే టీఆర్ఎస్ బలం చూసినట్లయితే 88 + 7 + 2 + 1 + 4 + 1 ఇలా మొత్తం 103 మంది సభ్యుల బలముంది. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం ఉంది. వాళ్లిద్దరిని కూడా కలిపితే  టీఆర్ఎస్ బలం 105 కు చేరుతుంది. అయితే 21 ప్రథమ ప్రాధాన్యం ఓట్లతో 5 స్థానాలను ఈజీగా గెలుచుకోవాలంటే టీఆర్ఎస్ కు మొత్తం 105 సభ్యులు కావాల్సి ఉండగా  కాంగ్రెస్ ఇద్దరు సభ్యులు సపోర్ట్ చేస్తే ఐదుకు, ఐదు క్లీన్ స్వీప్ చేస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని పిలుపునివ్వడంతో టీఆర్ఎస్, ఎంఐఎంలు ఐదు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెల్చుకోవడం ఖాయమనే టాక్ పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.