ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో సడలింపులు
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రార్థనలు, ఇతర మతపరమైన ఆచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి పనివేళల్లో ప్రత్యేక సడలింపులు ఇచ్చింది. ముస్లిం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకు తమ కార్యాలయాలు/స్కూళ్ళ నుంచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 7 నుంచి వచ్చే నెల 6 వరకు ఈ సడలింపులు అమల్లోకి ఉంటాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్.కె.జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.