కొత్త హంగులు : గులాబీ, తెలుపు రంగుల్లో MMTS రైళ్లు
కొత్త MMTS రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కొత్త సదుపాయాలున్నాయి. గులాబీ, తెలుపు రంగుల్లో కొత్త రైళ్లున్నాయి. కొత్త ఎంఎంటీఎస్ రైళ్లు మే 01వ తేదీ బుధవారం ప్రయాణించనున్నాయి. బుధవారం ఉదయం 4.30 గంటలకు, తిరిగి ఉదయం 6 గంటలకు కొత్త ఎంఎంటీఎస్ రైళ్లు ఫలక్నుమా –సికింద్రాబాద్ – లింగంపల్లి మార్గంలో అందుబాటులోకి రానున్నాయి.
దక్షిణ మధ్య జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా రైళ్ల నిర్వహణపై ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం రైల్నిలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రయాణీకుల రష్ దృష్టిలో పెట్టుకుని రైళ్లకు బోగీలను పెంచాలని శాఖాధికారులు భావిస్తున్నారు. ప్రస్తతం 9 బోగీలతో రైళ్లు తిరుగుతున్నాయి. దశలవారీగా 12 బోగీలతో తిరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 9 బోగీలతో ఉండే రైళ్లలో మొత్తం 700 మంది కూర్చొనే అవకాశం ఉంది. 2 వేల మంది నిల్చుంటే.. మొత్తం 2 వేల 700 మంది ప్రయాణించగలరు. 12 బోగీలుంటే..కూర్చొని..నిలబడే వారి సంఖ్య 5 వేలకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైల్వే ఇప్పటికే 4 MMTS కొత్త రైళ్లను సిద్ధం చేసింది. ఈ నాలుగింటిలో రెండు రైళ్లు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటికి 12 బోగీలుంటాయని ద.మ. రైల్వే ప్రకటించింది.
ప్రతి రోజు 1.70 లక్షలకు పైగా ప్రయాణీకులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. సేవలను విస్తరిస్తే ప్రయాణీకులు ఎక్కే సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు అనుకుంటున్నారు. సమయ పాలనపై కూడా దృష్టి సారించాలని సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు. కొత్తగా వచ్చే రైళ్లలో అత్యాధునిక సౌకర్యాలు ఉండనున్నాయి. మహిళల కోసం కేటాయించిన బోగీల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతికతతో బ్రేకింగ్ విధానం..ఇంజిన్లు పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.