రూ.10వేల సాయం కోసం మీ సేవ కేంద్రానికి వెళ్లిన వృద్ధురాలు మృతి, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం

  • Published By: naveen ,Published On : November 18, 2020 / 02:39 PM IST
రూ.10వేల సాయం కోసం మీ సేవ కేంద్రానికి వెళ్లిన వృద్ధురాలు మృతి, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం

old woman die: హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 3 గంటలుగా మీ సేవ కేంద్రం దగ్గర లైన్ లో నిలబడిన వృద్ధురాలు కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయింది. హైదరాబాద్ లో వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. సాయం అందని వారు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. దీంతో వరద సాయం కోసం బాధితులు మీ సేవ కేంద్రాలకు పోటెత్తారు.

వందలు వేలాది మంది మీ సేవా కేంద్రాల ముందు బారులు తీరారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. అయితే గంటల తరబడి నిల్చోలేక కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలు చనిపోవడం బాధాకరం.

పబ్లిక్ ను కంట్రోల్ చెయ్యలేక పోలీసుల పాట్లు:
ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం కోసం నగర జనం అల్లాడుతున్నారు. తెల్లవారుజాము నుంచే మీ సేవా కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర బారులు తీరారు. కాగా, సర్వర్లు పని చేయడం లేదంటూ పలు చోట్ల మీసేవా కేంద్రాలు మూతబడటం జనాలను మరింత అసహనానికి గురి చేస్తోంది. అప్లికేషన్లు ఇచ్చి వెళ్లిపోవాలని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు చెబుతుండడంతో ఏం చేయాలో అర్థం కాక బాధితులు సతమతమవుతున్నారు. గంట గంటకు రద్దీ పెరుగుతుండడంతో.. మీ సేవా కేంద్రాలకు పోలీసుల రక్షణ కల్పిస్తున్నారు. పబ్లిక్‌ను కంట్రోల్‌ చేయలేక పోలీసులు సైతం ఇబ్బంది పడుతున్నారు.

కరోనా వ్యాపిస్తుందని భయాందోళన:
హైదరాబాద్ జియాగూడలోనూ మీ సేవా సెంటర్ల దగ్గర వరద బాధితులు పడిగాపులు కాస్తున్నారు. భారీగా తరలివచ్చిన బాధితులు పేర్లు నమోదు చేసుకునేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వరద బాధితుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. చిన్నారులతో వచ్చిన వారు పాట్లు పడుతున్నారు. మీ సేవా కేంద్రాల దగ్గర వరద బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది. మీ సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు గంటల తరబడి పడిగాస్తున్న బాధితులు.. కరోనాకు సంబంధించి కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. కిక్కిరిసి ఉన్న క్యూ లైన్లలో భౌతికదూరమన్న మాటే కనిపించడం లేదు. వృద్ధులు సైతం ప్రమాదకర పరిస్థితుల మధ్య మీ సేవా కేంద్రాల దగ్గర నిరీక్షిస్తున్నారు.

మీ సేవా కేంద్రాల దగ్గర వరద బాధితులు పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు నిన్నటి నుంచి ఇంటికి వెళ్లకుండా పడిగాపులు కాస్తుంటే.. మరికొందరు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పడిగాపులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది.