నానక్రాం గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్లో వన్ వే
నానక్రాం గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్లో వన్ వే అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. రద్దీ పెరుగుతున్నందున అక్టోబర్ 10 నుంచి అమలు చేయనున్నట్లు సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. రోడ్లపై చిరు వ్యాపారులు తిష్ట వేసినా, వాహనాలను పార్కింగ్ చేసినా..చర్యలు తప్పవని హెచ్చరించారు. వన్ వే అమలు చేస్తుండడం వల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
హయత్ హోటల్ జంక్షన్, వయా హిటాచి కన్సల్టింగ్, వర్చూసా, జెడ్ఎఫ్ ఇండియా టెక్నాలజీ, వేవ్ రాక్ ఎస్ఈజెడ్, హనీవెల్ జంక్షన్ నుంచి సాలర్ పురియా మీదుగా వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. ఐటీ ఉద్యోగులు, కంపెనీలు ఈ మార్పును గమనించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఐటీ రంగంలో శరవేగంగా దూసుకెళుతున్న మహానగరంలో ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల సంస్థ.. అతిపెద్ద కార్యాలయాన్ని నిర్మించనుంది. నానక్రాం గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్లో గూగుల్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఎన్నో ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. నిత్యం వేలాది మంది నగరంలోని పలు ప్రాంతాలకు ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఐటీ కారిడార్కు వెళ్లే మార్గాలన్నీ కిక్కిరిసిపోతుంటాయి. మెట్రో రైలు రావడంతో కొంత రద్దీ తగ్గింది.