రికార్డు బ్రేక్ : బాలాపూర్ లడ్డూ రూ. 17 లక్షల 60 వేలు
బాలాపూర్ లడ్డూ ఈసారి కూడా రికార్డు బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే ఎంతో ఆసక్తి, ఉద్విగ్నతను క్రియేట్ చేసిన ఈ లడ్డూను కొలను రామ్ రెడ్డి దక్కించుకున్నారు. గణేష్ వేడుకల్లో బాలాపూర్ లడ్డూకు ఓ ప్రత్యేకత స్థానం ఉంది. భక్తుల కొంగుబంగారంగా ఈ లడ్డూ ప్రసిద్ధి పొందింది. 1994 నుంచి వేలం పాట కొనసాగుతూ వస్తోంది. సెప్టెంబర్ 12వ తేదీ గురువారం బొడ్రాయి వద్ద వేలం పాటను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.
వేలం పాటలో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొనడం విశేషం. తొలుత వేలం పాటను రూ. 1116తో ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న వారు పోటాపోటీగా వేలం పాటను పాడారు. చివరకు కొలను రామ్ రెడ్డి రూ. 17 లక్షల 60 వేలకు పాడి దక్కించుకున్నారు. 2018 సంవత్సరంలో బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ. 16 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. వేలం పాటకు ముందు…బాలాపూర్ పురవీధుల్లో గణేశుడు ఊరేగారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం హుస్సేన్ సాగర్ వైపు గణేశుడు కదిలాడు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 18 కి.మీ పాటు శోభాయాత్ర కొనసాగనుంది.
1994 నుంచి ప్రారంభమైన లడ్డూ వేలం ఏటికేడూ ప్రఖ్యాతి పొందింది. 25 ఏళ్లలో రూ. 450 నుంచి రూ. 16.60 లక్షలకు లడ్డూ ధర చేరింది. తాపేశ్వరంలోని హానీ ఫుడ్స్లో లడ్డూ తయారీ జరుగుతోంది. వేలంలో పాడుకున్న వారు ఈ లడ్డూను అపురూపంగా భావిస్తుంటారు. పొలాల్లో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకం..మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ లడ్డూ వేలాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.
సంవత్సరం | దక్కించుకున్న వారి పేరు | ధర |
1994 | కొలను మోహన్ రెడ్డి | రూ. 450 |
1995 | కొలను మోహన్ రెడ్డి | రూ. 4, 500 |
1996 | కొలను కృష్ణారెడ్డి | రూ. 18, 000 |
1997 | కొలను కృష్ణారెడ్డి | రూ. 28, 000 |
1998 | కొలను మోహన్ రెడ్డి | రూ. 51, 000 |
1999 | కల్లెం ప్రతాప్ రెడ్డి | రూ. 65, 000 |
2000 | కల్లెం అంజిరెడ్డి | రూ. 66, 000 |
2001 | జి. రఘునందన్ చారి | రూ. 85, 000 |
2002 | కందాడ మాధవరెడ్డి | రూ. 1, 05, 000 |
2003 | చిగిరింత బాల్ రెడ్డి | రూ. 1, 55, 000 |
2004 | కొలను మోహన్ రెడ్డి | రూ. 2, 01, 000 |
2005 | ఇబ్రం శేఖర్ | రూ. 2, 08, 000 |
2006 | చిగిరింత తిరుపతి రెడ్డి | రూ. 3, 00, 000 |
2007 | జి.రఘునందన్ చారి | రూ. 4, 15, 000 |
2008 | కొలను మోహన్ రెడ్డి | రూ. 5, 07, 000 |
2009 | సరిత | రూ. 5, 10, 000 |
2010 | కొడాలి శ్రీధర్ బాబు | రూ. 5, 35, 000 |
2011 | కొలను బ్రదర్శ్ | రూ. 5, 45, 000 |
2012 | పన్నాల గోవర్ధన్ రెడ్డి | రూ. 7, 50, 000 |
2013 | తీగల కృష్ణారెడ్డి | రూ. 9, 26, 000 |
2014 | సింగిరెడ్డి జై హింద్ రెడ్డి | రూ. 9, 50, 000 |
2015 | కొలను మదన్ మోహన్ రెడ్డి | రూ. 10, 32, 000 |
2016 | స్కైలాబ్ రెడ్డి | రూ. 14, 65, 000 |
2017 | నాగం తిరుపతి రెడ్డి | రూ. 15, 60,000 |
2018 | శ్రీనివాస్ గుప్తా | రూ. 16, 60, 000 |
2019 | కొలను రామ్ రెడ్డి | రూ. 17, 60, 000 |