రోడ్డు విస్తరణ కోసం 20 వేల చెట్లు నరికివేత

  • Published By: chvmurthy ,Published On : September 15, 2019 / 02:54 AM IST
రోడ్డు విస్తరణ కోసం 20 వేల చెట్లు నరికివేత

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో 20 వేల చెట్లు నేల కూలనున్నాయి. వనం గుండా జనం వెళ్లేందుకు వృక్షాలను బలి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి 765 విస్తరణలో  భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు జోన్ పరిధిలో ఈ ఉపద్రవం ఎదురు కాబోతోంది. ఇప్పటికే నల్లమలలో యురేనియం తవ్వకాలకు రంగం సిధ్ధం అవుతుంటే ఇప్పుడు మరో ఉపద్రవం వచ్చి పడుతోంది. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆధ్వర్యంలో తోకపల్లి నుంచి హైదరాబాద్‌ వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న వేలాది చెట్లు కొట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ నేతృత్వంలో మార్కింగ్‌లు కూడా పూర్తయ్యాయి.

ఆమ్రాబాద్‌ పులుల అభయారణ్యం మీదుగా శ్రీశైలం గుడికి వెళ్లేందుకు ఉన్న ఇరుకైన సింగిల్‌ రోడ్డు వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని విస్తరించాల్సి ఉందని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ప్రతిపాదించింది. ఈ రోడ్డులో ఎక్కువ మలుపులు ఉన్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని రోడ్డు విస్తరణ ద్వారా సరిచేయాలని తెలిపింది. రోడ్డు విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను నేషనల్‌ హైవే అథారిటీ అయిదారు నెలల కిందటే  రాష్ట్ర అటవీశాఖకు పంపింది. వాస్తవానికి ఈ రోడ్డులో శని ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో అంత రద్దీ ఉండదు.  మాములు రోజుల్లో వెయ్యిలోపు వాహానాలే ఈ మార్గం గుండా వెళుతుంటాయని అటవీ శాఖ అధికారులు అంచనా. వీకెండ్స్, సెలవు రోజుల్లో వీటిసంఖ్య రెండువేల వరకు ఉంటుందని తెలుస్తోంది. 

మన్ననూరు గ్రామం నుంచి శ్రీశైలం దేవాలయానికి వెళ్లేందుకు ఉన్న శ్రీశైలం బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. దోమలపెంట గ్రామం వద్ద ఈ రోడ్డు ముగుస్తుంది. ఈ 60 కి.మీ. పరిధి అంతా కూడా ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ కోర్‌ ఏరియాలోనే ఉంది. రోడ్డు వెడల్పు వల్ల అడవికి, వేలాది చెట్లకు, జంతువులకు, పులుల అభయాణ్యానికి నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వాహనాలు పెరిగి కాలుష్య ప్రభావం కూడా ఈ టైగర్‌ రిజర్వ్‌పై పడుతుందని వారు అంటున్నారు. రోడ్డు విస్తరించటం వలన వాహనాల వేగం పెరిగి జంతువులు ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.  

రోడ్డు విస్తరణకోసం నేషనల్ హైవైస్ అధారిటీ నుంచి అందిన ప్రతిపాదనలను రాష్ట్ర అటవీ శాఖ, నాగర్‌కర్నూల్‌ జిల్లా అటవీ అధి కారులకు పంపించింది. ఈ ప్రతి పాదనలకు అనుగుణంగా ఫారెస్ట్‌ డివిజన్‌ ఆఫీసర్‌ నివేదికను సిద్ధం చేసింది.  ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్ని వేల చెట్లు పోతాయి, వాట విలువ ఏమిటీ, అడవి ఏ మేరకు నష్టపోతుంది, దెబ్బతినే అటవీ భూమి విస్తీర్ణం ఎంత తదితర వివరాలను నివేదికలో జిల్లా అటవీ అధికారులు పొందుపరుస్తారు. వివిధ స్దాయిల్లో రూపోందించిన నివేదిక అందిన తర్వాత రోడ్డు విస్తరణ ఎప్పుడు ‘ప్రారంభించాలనే దానిపై నేషనల్‌ హైవేస్‌ అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. తదనుగుణంగా డబ్బు రూపంలో ఎంత పరిహారమివ్వాలి, కోల్పోయిన అటవీభూమికి ఇతర భూములు ఎక్కడ ఎన్ని ఎకరాల మళ్లించాలి.. తదితర అంశాలపై నేషనల్‌ హైవే నిర్ణయం తీసుకుంటుంది.