జయభేరి సొమ్ము 2 కోట్లు స్వాధీనం
హైదరాబాద్: హైదరాబాద్ హై టెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద నగదు తరలిస్తున్న జయబేరి గ్రూప్ సంస్ధలకు చెందిన ఇద్దరు వ్యక్తులను బుధవారం రాత్రి సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును రాజమండ్రి తరలిస్తున్నట్లు వారు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లేందుకు తీసుకున్న రైల్వే టికెట్లు కూడా వీరి వద్ద దొరికాయి. జయభేరి గ్రూప్ సంస్ధకు చెందిన నిమ్మలూరి శ్రీహరి, అరుటి పండరి అనే ఇద్దరు ఉద్యోగులు బ్యాగుల్లో నగదు తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు.
జయభేరి సంస్ధ అధినేత, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ కోడలు మాగంటి రూప రాజమండ్రి నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు. వీరికి ఈ డబ్బు ఎవరిచ్చారు ? ఎలాంటి పత్రాలు ఉన్నాయి ? అనే అంశాలను పోలీసులు విచారిస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఈ నగదు తీసుకువెళుతున్నట్లు పోలీసులు నిర్ధారించి ఎన్నికల నిబంధనల మేరకు కేసు నమోదు చేశారు.