షీ టీమా మజాకా : 30 రోజుల్లో 38 మంది ఆకతాయిలు అరెస్ట్
యువతులను, మహిళలను వేధించే ఆకతాయిలకు ‘షీ టీమ్’ సింహస్వప్నంలా తయారయ్యింది. ఈవ్ టీజింగ్ తో వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. దీంతో షీటీమ్ యువతులకు, మహిళలకు ‘భరోసా’నిస్తోంది. ఎవరైనా వేధిస్తే కాల్ చేస్తే చాలు ఆకతాయుల ఆట కట్టిస్తోంది ‘షీ టీమ్’.
స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులకు..డ్యూటీలకు వెళ్లే యువతులు, మహిళలకు వేధిస్తున్న ఆకతాయులను కేవలం 30 రోజుల్లో 38మందిని అరెస్ట్ చేశారు షీ టీమ్ నిర్వాహకులు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై 53 కేసులను నమోదు చేశారు.వాటిలో 33 ఎఫ్ఐఆర్లు, 16 పెట్టీ కేసులు, 4 కౌన్సెలింగ్ కేసులను బుక్ చేశారు. ఈ క్రమంలో 33 మంది మేజర్లను, ఐదుగురు మైనర్లను అరెస్టు చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ, సైకాలజిస్ట్ లతో వారికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఇంటర్ చదివే విద్యార్థి రోజు కాలేజీకి వెళ్తున్న దారిలో ఆమె వెంట పడుతు ప్రేమించమని ఓ ట్రాక్టర్ డ్రైవర్ గత ఆరు నెలల నుంచి వేధింపులకు పాల్పడుతున్నాడు. అంతేకాదు అవమానకంగా మాట్లాడుతు..దుర్భాషలాడుతు వేధిస్తు..నువ్వు ఒప్పుకోకపోయినా బలవంతంగా పెళ్లి చేసుకుంటానంటు వేధిస్తున్నాడు. విసిగిపోయిన ఆమె ఫిబ్రవరి 4న ‘షీటీమ్’ కంప్లైంట్ చేసింది. దీంతో భువనగిరి టౌన్ పీఎస్ పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ బొంతుల రామకిరణ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇలాగే మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వేధింపులకు గురిచేశాడు. ప్రేమించమంటు వెంట పడుతు తనను పెళ్లి చేసుకోకుంటే మీ తల్లిదండ్రులను చంపేస్తాను. అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆమె నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాంబశివరావు అనే సదరు ప్రబుద్ధుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇలా పలువురు యువతులు..మహిళలు చేసిన ఫిర్యాదులకు వెంటనే రెస్పాండ్ అయిన షీటీమ్ 38మందిని అరెస్ట్ చేసింది.
షీ టీమ్ కేవలం ఆకతాయిల ఆట కట్టించటమే కాదు బాల్య వివాహాలకు కూడా చెక్ పెడుతోంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 61 మంది మైనర్ బాలికలను బాల్య వివాహాల నుంచి కాపాడారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు భయం, ఆందోళన లేకుండా ముందుకు వచ్చి పోకిరీలు, ఆకతాయిలపై ఫిర్యాదు చేయాలని సీపీ మహేశ్భగవత్ సూచించారు. డయల్ 100, వాట్సాప్ నంబరు 94906 17111కు సమాచారం అందించాలని తెలిపారు.