ఇంటర్ బోర్డ్ దగ్గర పోలీసుల హడావిడి : విద్యార్థులు, మీడియాపై దౌర్జన్యం

  • Published By: veegamteam ,Published On : April 22, 2019 / 09:55 AM IST
ఇంటర్ బోర్డ్ దగ్గర పోలీసుల హడావిడి : విద్యార్థులు, మీడియాపై దౌర్జన్యం

ఇంటర్మీడియట్ బోర్డుపై రోజురోజుకు ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దటం కంటే.. అధికారులు ఎదురుదాడికి దిగటం ఆందోళన కలిగిస్తోంది. బోర్డు వైఖరికి నిరసనగా, న్యాయం చేయాలంటూ నాంపల్లిలోని బోర్డు ఎదుట స్టూడెంట్స్, పేరంట్స్ భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. వీరికి సమాధానం చెప్పాల్సిన బోర్డు అధికారులు.. తప్పించుకుని తిరుగుతున్నారు. అన్నీ సరిచేస్తాం అంటూ చెప్పుకొస్తున్నారు. రీ వ్యాల్యూయేషన్ కోసం 600 రూపాయలు చెల్లించాలంటూ కండీషన్ పెట్టారు. దీనిపై పేరంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తప్పు చేస్తే.. డబ్బులు మేం ఎందుకు కట్టాలని నిలదీస్తున్నారు. 600 డబ్బులు కడతాం.. పోయిన ప్రాణాలు తీసుకొస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

భారీ ఎత్తున స్టూడెంట్స్, పేరంట్స్, విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు దగ్గరకు వస్తుండటంతో.. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించాయి. అరెస్టులు చేస్తున్నరు. బోర్డు చుట్టుపక్కల ఎవరూ ఉండొద్దని ఆంక్షలు విధిస్తున్నారు. న్యాయం చేయమని అడగాటానికి వచ్చిన విద్యార్ధులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. అదేమని ప్రశ్నించిన మీడియా ప్రతినిథులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. లైవ్ కవరేజ్ ను అడ్డుకున్నారు. ఇంటర్ బోర్డ్ దగ్గరకు వస్తున్న విద్యార్ధులు, వారి తల్లిదండ్రులను ఎక్కడిక్కడే అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మా బిడ్డల భవిష్యత్తు గురించి అడగటానికి వస్తే.. మాపై ఈ దాడులేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మెరిట్ స్టూడెంట్ అయిన మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు.. అడగటానికి వస్తే ఎవ్వరూ సమాధానం చెప్పటంలేదని  ఓ విద్యార్ధి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై  కమిటీ వేశామని ఒకే ఒక్కమాట చెప్పేసి మంత్రి జగదీశ్ రెడ్డి వెళ్లిపోయాడని..వారి పిల్లలకే గనుక ఇటువంటి పరిస్థితి వస్తే హాయిగా ఇంట్లో పడుకుంటాడా అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజుల నుంచి పడిగాపులు పడుతున్నాం.. ఎలాంటి సమాధానం రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేతల మద్దతు, రేవంత్ రెడ్డి అరెస్ట్ 
ఇంటర్ బోర్డు ఎదుట ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలోనే వారికి కాంగ్రెస్ నేతలు మద్దతు పలికాదు. రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ ధర్నాలో పాల్గొన్నారు. వీరిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్ధి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నేతల బహిరంగ లేఖ
 సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కలు బహిరంగ లేఖ రాశారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన మిస్టేక్స్ పై ప్రభుత్వం స్పందించటంలేదనీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయిందని లేఖలో తెలిపారు. 9.45 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేసిందని..ఫలితాలు వెల్లుడిన మూడు రోజుల్లో 12మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనీ వారి ఆశల్ని ప్రభుత్వం నాశనం చేసిందని లేఖలో పేర్కొన్నారు. ఈ దుస్థితితో విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారనీ ఆరోపించారు.