మున్సిపల్ పోరుకు ఒంటరిగా తెలుగుదేశం
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ. ఈ మేరకు ఆ పార్టీ నిర్ణయాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ ప్రకటించారు. టీడీపీని పటిష్ఠపరిచేందుకు మునిసిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించామని ఎల్.రమణ వెల్లడించారు.
ఇందుకోసం రాష్ట్రస్థాయిలో 15 మంది తెలుగుదేశం నేతలతో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకుని, పార్టీ శ్రేణులంతా ఈ ఎన్నికల్లో పాల్గొనేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తవగానే ప్రచారానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో పార్టీ ముఖ్యులతో సమావేశం అయిన రమణ ఈ మేరకు నేతలకు దిశానిర్ధేశం చేశారు.
ఇప్పటికే స్థానాలవారిగా నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ కమిటీలను కూడా నియమించామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో జతకట్టి వెళ్లిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది.