తెలంగాణ @ 33 : రేపటి నుంచి రెండు కొత్త జిల్లాలు

  • Published By: chvmurthy ,Published On : February 16, 2019 / 10:44 AM IST
తెలంగాణ @ 33 : రేపటి నుంచి రెండు కొత్త జిల్లాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రేపట్నుంచి మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.  సీఎం ఎన్నికల ఇచ్చిన హామీల్లో భాగంగా నారాయణపేట, ములుగు జిల్లాల  ఏర్పాటుకు ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబరు 31 నుంచి 30 రోజుల పాటు  అభ్యంతరాలు, సలహాలు సూచనలు  స్వీకరించారు.  ప్రభుత్వ  ఉత్తర్వులకు అనుగుణంగా ఆ ప్రతిపాదనపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవటంతో రెవెన్యూ శాఖ శనివారం తుది నోటిఫికేషన్ ఇచ్చింది. 

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత 2016 అక్టోబర్ 11న కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటయ్యాయి. దాంతో జిల్లాల సంఖ్య 31 కి చేరింది. 2018  ఎన్నికల హామీలలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాను పునర్వ్యవస్థీకరించి 11 మండలాలతో నారాయణపేట జిల్లాను, అలాగే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాను పునర్వ్యవస్థీకరించి తొమ్మిది మండలాలతో సమ్మక్క – సారలమ్మ ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.   

నారాయణ పేట జిల్లాలో  నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఉక్కూరు, నర్వ, మక్తల్, మాగనూరు కృష్ణా వంటి 11 మండలాలు  ఉన్నాయి. ములుగు జిల్లాలో  ములుగు, వెంకటాపూర్, గోవిందరావు పేట, తాడ్వాయి (సమ్మక్క-సారక్క) ఏటూరునాగారం, ఖన్నాయగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు వంటి 9 మండలాలు ఉన్నాయి. దీంతో రేపటి నుంచి మరో 2 జిల్లాలు పెరగటంతో మొత్తం సంఖ్య 33 కు చేరింది. రెండు కొత్త జిల్లాలకు ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర అధికారులను నియమించనున్నారు. 

Read Also :  పుల్వామా ఎటాక్ : ఆనంద్ మహేంద్రా పోస్ట్ వైరల్
Read Also :  ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా