మాజీ హోం మంత్రి నాయిని ఆరోగ్యం విషమం
Nayani Narasimhareddy health : కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు.
సెప్టెంబర్ 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారు…..అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురవటంతో న్యుమోనియా సోకిందని డాక్టర్లు నిర్ధారించారు.
దీంతో నాయిని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అక్టోబర్13, మంగళవారం ఆయనను వెంటనే జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్ రవి ఆండ్రూస్, మరో డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
కుటుంబ సభ్యులకూ కరోనా……
ఇదిలా ఉండగా నాయిని కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. ఆమె కూడా బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ ఆసుపత్రిలోనే ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు. అలాగే నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
కార్యక్రమాల్లో పాల్గోనటం వల్లే కరోనా సోకింది
లాక్డౌన్తో పాటు కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఇంటికే పరిమితమైన నాయిని నరసింహారెడ్డి ఇటీవల ముషీరాబాద్లో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొని అభిమానులు అందించిన కేక్ను తిన్నారు.
అలాగే ఓ మతపెద్ద ఇంటి ప్రహరీ గోడ కూలిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లారు. దానికి తోడు ఓ మత పెద్ద సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఎక్కడో నాయినికి కరోనా సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.