ఫెయిలైన విద్యార్థుల పేపర్లు కరెక్షన్ చేయండి: హైకోర్టు
తెలంగాణలో ఇంటర్ పరిక్షలు దిద్దడంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంటర్ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఫెయిలైన విద్యార్థుల పేపర్లను మళ్లీ కరెక్షన్ చేయాలని అభిప్రాయపడింది. అందుకు ఎంత సమయం పడుతుంది అనే విషయమై అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించిన హైకోర్టు.. సుమారు 2నెలలు పడుతుంది అని చెప్పడంతో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిల్ అయిన 3లక్షల మంది విద్యార్ధుల పేపర్లు దిద్దటానికి అంత సమయం ఎందుకు అని ప్రశ్నించింది.
ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, ఈ విషయంలో సాధ్యమయ్యే విషయాలపై అధికారులతో చర్చించి చెబుతామని అదనపు అడ్వొకేట్ జనరల్ ఉన్నత న్యాయస్థానానికి వెల్లడించారు. ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని జీవోను హైకోర్టుకు సమర్పించారు. ఏజెన్సీ పనితీరుపై మాత్రమే విచారణకు ఆదేశించారని అభిప్రాయపడిన హైకోర్టు.. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించాలని అభిప్రాయపడింది. దీనిపై న్యాయవిచారణకు ఆదేశించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించగా.. న్యాయవిచారణతో విద్యార్థులకు ప్రయోజనం ఉండదని చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సోమవారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.