ఇతర దేశాల్లోనూ : ‘తెలంగాణ’ బియ్యానికి బ్రాండింగ్
హైదరాబాద్ : తెలంగాణ బియ్యానికి బ్రాండ్ సాధించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్నికొనుగోలు చేసి..బియ్యంగా మార్చి వాటిని ‘తెలంగాణ’ బ్రాండ్ పేరిట దేశీయ, విదేశీ మార్కెట్లలో విక్రయించేందుకు యత్నిస్తోంది. ఏం పండించాం… ఎంత పండిచామన్నది కాదు.. దానికి ఎంత మార్కెట్ కల్పించాం.. రైతులకు ఎంత లబ్దిని చేకూర్చామన్నదే ముఖ్యం ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
సాగునీటి వసతిని పెంచటంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగి ధాన్యం దిగుబడి అంచనాలను మించడంతో బియ్యానికి మార్కెట్ కల్పించేదిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వరి సాగు విస్తీర్ణం మరింత పెరిగి… ధాన్యం దిగుబడి పెరుగుతుందని… దాని ప్రభావం ధరలపై పడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. దీంతో బియ్యం మార్కెటింగ్కోసం, పౌరసరఫరాల వ్యవస్థను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అధ్యయనం చేయించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నిర్ణయించారు.
ఈ క్రమంలో బియ్యం మార్కెటింగ్పై రీసెర్చ్ రెస్పాన్సబిలిటీని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి అప్పగించారు. ఆ సంస్థ ఇటీవల ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేయటంతో ఫ్యూచర్ లో మరింతగా పెరిగే ధాన్యం దిగుబడిని సద్వినియోగం చేసుకునేందుకు ప్లాన్స్ తో పాటు ఇన్ కమ్ పెంచేందుకు పలు మార్గాలను సూచించింది. సన్న బియ్యం, ఇతర బ్రాండ్ల పేరుతో ఓ వైపు మార్కెట్లో దోపిడీ కొనసాగుతుండగా.. ఇక ఆ దోపిడీకి చెక్ పెట్టేలా ప్రభుత్వం యోచిస్తోంది.