తెలంగాణలో 13ఏళ్లకే ఓటు హక్కు వచ్చేసింది
తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల గల్లంతు పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్నికల సంఘం దీనిపై వివరణ ఇస్తూ క్షమాపణలు కూడా చెప్పింది. తప్పులు తడకలుగా ఎన్నికలు నిర్వహించి ఓటర్లను ఇబ్బందులకు గురిచేసిన ఈసీ.. 13ఏళ్ల బాలుడికి ఓటు హక్కు కల్పించడం సంచలనం అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మహ్మద్ వజీర్ అలీ అనే 13 ఏళ్ల బాలుడు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. అతడి ఆధార్లో పుట్టిన తేదీ తప్పుగా ఉండడంతో అతని వయస్సు 18గా నమోదైంది.
అయితే బాలుడి ఆధార్ కార్డు ఆధారంగా ఎవరో ఓటరు నమోదు చేయగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఈసీ బాలుడికి ఓటు హక్కు కల్పించింది. పటాన్చెరు నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నంబరు 241, సీరియల్ నంబర్ 961పై అతడి పేరు నమోదైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.