ఇంటర్ బోర్డుపై త్రిసభ్య కమిటీ నివేదిక రెడీ
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల అవకతవకలపై శుక్రవారం త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇంటర్ బోర్డ్, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డ్ తప్పిదాలను.. గ్లోబరినా సంస్థ తప్పిదాలను కమిటీ గుర్తించింది. ఇంటర్ బోర్డ్ క్రాస్ చెక్ చేయకుండా ఫలితాలను విడుదల చేసిందని త్రిసభ్య కమిటీ తేల్చింది. గ్లోబరినా సంస్ధ మొదటి నుంచి కూడా టెక్నికల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కోందని కమిటీ గుర్తించింది. సంస్ధ సామర్ధ్యం చూసుకోకుండా ఇంటర్ బోర్డు గ్లోబరీనా సంస్ధకు టెండర్లు ఇచ్చిందని నివేదికలో పేర్కోన్నట్లు తెలుస్తోంది. అర్హత లేని సంస్ధకు టెండర్లు ఇచ్చినట్లు గుర్తించి, బోర్డు పై కూడా, త్రిసభ్య కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇంటర్ బోర్డులో నెలకొన్న అంతర్గత కలహాలు కూడా తప్పిదాలకు కారణాలని నివేదికలో పొందు పరిచినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు ఒక ప్రత్యేక వ్యవస్ధను ఏర్పాటు చేయాలని కూడా త్రిసభ్య కమిటీ తన నివేదికలో సూచించినట్లు తెలిసింది. గ్లోబరీనా సంస్ధపై చట్టపరమైన చర్యలు తీసుకొనే అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు ఇంటర్మీడియేట్ బోర్డులో నెలకొన్న అంతర్గత కలహాలపైనా దృష్టి పెట్టిన ప్రభుత్వం కొందరు అధికారులపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.