టీఆర్ఎస్ సెంచరీ కొట్టేసింది

  • Published By: vamsi ,Published On : March 18, 2019 / 07:51 AM IST
టీఆర్ఎస్ సెంచరీ కొట్టేసింది

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారీ మెజార్టీతో తిరిగి అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో సెంచరీ కొట్టేసింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ సెంచరీ కొట్టడం ఖాయం అంటూ ఆ పార్టీ నేతలు చెప్పినప్పటికీ, చివరకు 88సీట్లు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. అయితే గవర్నర్ కోటాలో ఎన్నికైన స్టీఫన్‌సన్‌, ఎన్నికల తర్వాత పార్టీలో చేరుతున్నవారితో కలుపుకుని టీఆర్ఎస్ బలం ఇప్పడు వందకు చేరుకుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్షాన 88మంది గెలుపొందగా, ఒక ఇండిపెండెంట్, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ గుర్తుపై గెలిచిన ఒక ఎమ్మెల్యే వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరారు. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరారు. రేగా కాంతారావు, ఆత్రం సక్కులతో మొదలైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వలసల సంఖ్య వనమాతో 8కి చేరింది.

టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్‌లో చేరగా.. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్‌స‌న్‌తో క‌లిపి టీఆర్ఎస్ సభ్యుల బ‌లం 100కు చేరింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ప్రకారం చూసుకుంటే ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్ లోక‌స‌భ స్థానాల్లో వెనుక‌బ‌డ్డ టీఆర్ఎస్.. ఎమ్మెల్యేల చేరికతో 16 లోక్ స‌భ స్థానాల్లో బలం తెచ్చుకున్నట్లు అయ్యింది. 

ప్ర‌స్తుతం అసెంబ్లీలో పార్టీల వారీగా సంఖ్యాబలం:
మొత్తం స‌భ్యులు-120 (నామినేటెడ్ ఎమ్మెల్యేతో క‌లిపి)
టిఆర్ఎస్ బ‌లం – 100 
టిఆర్ఎస్ త‌రఫున గెలిచిన ఎమ్మెల్యేలు – 88
టిఆర్ ఎస్‌లో చేరిన ఇద్ద‌రు స్వతంత్రులు
టిఆర్ ఎస్ త‌ర‌ఫున అసెంబ్లీలో ఉన్న‌ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్‌స‌న్‌
కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు – 8
కారెక్కిన టిడిపి ఎమ్మెల్యే – 1
ఎంఐఎం-7 (టిఆర్ ఎస్ మిత్ర‌ప‌క్షం)
కాంగ్రెస్ – 11
బిజేపీ-1
టిడిపి-1