గెలిస్తే సూపర్.. ఓడితే ట్రాష్ : బాబుకి కేటీఆర్ చురకలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న వీధి నాటకాలు చూస్తుంటే.. ఏపీలో ఎవరు గెలుస్తున్నారో అర్ధం అవుతోందంటూ వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి… లేకపోతే కావా? అని సూటిగా ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన దేశానికి ఐటీని తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. EVMలకు వ్యతిరేకంగా మాట్లాడటం బాధాకరమన్నారు. 2014లో ఆయన గెలిచింది EVMల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే కదా? అని ప్రశ్నించారు. గెలిస్తే EVMలు సూపర్.. లేకుంటే ట్రాష్.. ఇదేం పద్ధతి ? అని చంద్రబాబు వ్యవహార శైలిని నిలదీశారు.
EVMలలో లోపాలు ఉంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్ధాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా గెలిచిందో చెప్పాలని నిలదీశారు కేటీఆర్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది.. నిజంగా EVMలను ట్యాంపరింగ్ చేసి ఉంటే బీజేపీనే గెలిచేదికదా? అని ప్రశ్నించారు. “ఓటుహక్కు వినియోగించుకునే సమయంలో ఓటర్లు అనేకమంది తమ ఓటులేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుందనేది ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
ప్రభుత్వాల జోక్యం, ప్రమేయం లేకుండా ఎన్నికల అధికారులే ఓటరు జాబితా తయారు చేస్తున్నారు.. ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల గల్లంతుపై దేశవ్యాప్తంగా చర్చజరగాలని కోరారు కేటీఆర్. ఎన్నికల విధానాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.