దసరాకి ఆర్టీసీ స్పెషల్ బస్సులు
తెలంగాణా రాష్ట్రంలో అతి పెద్ద పండగలైన బతుకమ్మ, దసరా సందర్భంగా ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రదేశాలతో పాటు నగర శివారు నుంచి 4,993 అదనపు బస్సులను నడపనున్నారు. ఈ బస్సులు తెలంగాణలోని ప్రధాన నగరాలతో పాటు ఆంధ్ర, కర్ణాటకల్లోని పలుజిల్లాలకు నడపనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి అదనపు బస్సులను సెప్టెంబర్ 24, మంగళవారం నుంచే ప్రారంభించినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 4 నుంచి అదనపు బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. మహాత్మాగాంధీ బస్స్టేషన్, సీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్, దిల్సుఖ్నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్బీ, ఎస్సార్ నగర్, అమీర్పేట, టెలిఫోన్ భవన్. ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్రోడ్స్, ఎల్బీనగర్ నుంచి ఆధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అక్టోబరు నాలుగో తేదీ నుంచి రద్దీ ఉన్న ప్రాంతాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్ కోసం www.tsrtconline.in ను సంప్రదించాలని ఆర్టీసి అధికారులు తెలిపారు.
ప్రయాణికులకు సౌకర్యం కోసం, ట్రాఫిక్ రద్దీని తగ్గించటానికి జేబీఎస్ నుంచి.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వైపు వెళ్లే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
ఉప్పల్ క్రాస్రోడ్స్/ఉప్పల్ బస్స్టేషన్ నుంచి యాదగిరిగుట్ట, జనగామ, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూర్, వరంగల్ వైపు వెళ్లే ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
సీబీఎస్ నుంచి కర్నూల్, తిరుపతి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, మదనపల్లి వైపు వెళ్ళే బస్సులు ఉంటాయని ఆర్టీసీ అధికారులు వివరించారు.
ఏపీకి వెళ్లే ప్రత్యేక బస్సుల వివరాలు
విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచీలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు కూడా దసరాకు ప్రత్యేక బస్సులు నడిపిస్తామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు 1,697 బస్సులు,
అక్టోబర్ 4 నుండి 7 వరకు 3,236 బస్సులు నడిపిస్తున్నట్లు చెప్పారు.
అక్టోబర్ 4 న 749 ,
5 న 964,
6 న 712,
8వ తేదీన 72 బస్సులు నడపటానికి ప్రణాళిక రూపోందించినట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు.