తిరుమలలో మంత్రి కేటీఆర్ కుటుంబం
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్యలతో కలిసి కేటీఆర్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం తీసుకున్నారు.
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుమలకు భక్తుల భారీగా విచ్చేశారు. వీఐపీ బ్రేక్ అనంతరం సర్వదర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీంతో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర మహేశ్వరి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్, ఏపీకి చెందిన మంత్రులు పుష్ప శ్రీవాణి, పెద్దిరెడ్డి, అనిల్, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ మంత్రులు హరీష్రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.