ప్రియుడు కోసం సొంత నాయనమ్మ బంగారం దోచేసిన యువతి

  • Published By: vamsi ,Published On : November 4, 2020 / 09:52 PM IST
ప్రియుడు కోసం సొంత నాయనమ్మ బంగారం దోచేసిన యువతి

ప్రేమ మైకం ఎంతటి తప్పు అయినా చేయిస్తుంది అనేదానికి ఈ ఘటన ఓ సాక్ష్యం. ప్రియుడితో కలిసి సొంత నాయనమ్మ ఇంట్లో దొంగతనానికి పాల్పడింది ఓ మనవరాలు. ఈ ఘటన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకోగా.. చివరకు అసలు గుట్టు అంతా బయటపెట్టారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. డిఫెన్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న అమిలియా అనే వృద్ధురాలి ఇంట్లో ఈనెల 30న దొంగతనం జరిగింది.

ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వృద్ధురాలి మనవరాలు పెట్రిసియా(21) దొంగతనం చేసినట్లుగా గుర్తించారు. పెట్రిసియా నేరేడ్‌మెట్‌కు చెందిన అజయ్‌ అనే యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. డీజేగా పనిచేస్తున్న అజయ్‌ చెడు వ్యసనాలకు బానిస. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ప్రియురాలు పెట్రిసియా బంగారు గొలుసు తీసుకుని అమ్మేశాడు.

అయినా కూడా ప్రియుడుకు డబ్బులు సరిపోక పెట్రిసియా సాయంతో ఆమె నాయనమ్మ ఇంట్లోనే 18 తులాల బంగారం దొంగతనం చేశారు. నిందితుల దగ్గర నుంచి బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు పోలీసులు.